ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కాప్స్ (IRGC)పై ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) విరుచుకుపడ్డాయి. నిన్న అర్ధ రాత్రి సమయంలో 50కి పైగా వైమానిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కమాండ్ సెంటర్లు, ఆయుధ నిల్వ కేంద్రాలు, వైమానిక రక్షణ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకున్నారు.
ఇజ్రాయెల్ రక్షణ దళాలు X (ట్విట్టర్) లో తెలిపిన వివరాల ప్రకారం చూస్తే “ఆపరేషన్ రోరింగ్ లయన్” ప్రారంభమైనప్పటి నుండి ఇరాన్ అంతటా 3000కి పైగా దాడులు చేపట్టామని పేర్కొన్నాయి. “ఇటీవల IRGC కమాండ్ సెంటర్లు, ఆయుధ గిడ్డంగులు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్పై దాడులు చేశాం. రాత్రికి మరో 50కి పైగా లక్ష్యాలను, ముఖ్యంగా బాలిస్టిక్ క్షిపణి నిల్వలు, ప్రయోగ స్థలాలను లక్ష్యంగా చేసుకున్నాం” అని తెలిపారు.
అల్ జజీరా ఛానెల్ కథనం ప్రకారం మంగళవారం బాగ్దాద్ లో కూడా పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. అలాగే ఇరాక్ లోని PMF (Popular Mobilization Forces) స్థావరంపై అమెరికా వైమానిక దాడిలో మృతుల సంఖ్య 14కి పెరిగినట్లు తెలిపింది. ఇరాన్ మీడియాను ఉటంకిస్తూ దేశంలోని ఎనర్జీ మౌలిక సదుపాయాలపై కూడా దాడులు జరిగినట్లు పేర్కొంది.
ఇదే సమయంలో బెహరెన్ లోని ఒక పరిశ్రమలో అగ్ని ప్రమాదం సంభవించిందని, దీనికి “ఇరాన్ దాడులు కారణం” అని పేర్కొంది. ఇక టెల్ అవీవ్ లో ఇరాన్ క్షిపణి దాడిలో ఆరుగురు స్వల్పంగా గాయపడ్డారు. ఒక క్షిపణి సుమారు 100 కిలోల పేలుడు పదార్థంతో నగర మధ్యలో పడినట్లు నివేదికలు చెబుతున్నాయి.
ఈ దాడిలో పలు భవనాలు, వాహనాలు దెబ్బతిన్నాయి. అలాగే Rosh HaAyin (టెల్ అవీవ్ తూర్పున) ప్రాంతంలో కూడా క్షిపణి అవశేషాలు పడినట్లు సమాచారం.
