జూన్ నుంచి కోరుతుంటే ఇప్పటికి ఆయన దొరికాడు…. ఎవరు ఆయన? ఎవరు అడుగుతున్నారు? ఆ విషయం ఈ వార్త చదివితే అర్ధం అవుతుంది. “నా నియోజకవర్గం వాయనాడ్ గురించి చర్చించడానికి జూన్ నుంచి అపాయింట్మెంట్ కోరుతున్నాను. దయచేసి సమయం ఇవ్వండి” అని కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అడుగుతూనే ఉన్నారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వాద్రాకు చివరకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో ప్రత్యక్షంగా భేటీ అయ్యే అవకాశం లభించింది. జూన్ నెల నుంచి ఆయనను కలవాలని ప్రయత్నిస్తున్నానని ఆమె చెప్పిన నేపధ్యంలో, లోక్సభ ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశాన్ని సభలో లేవనెత్తిన వెంటనే ఈ అనూహ్య సమావేశం జరిగింది.
గడ్కరీ పార్లమెంట్ హౌస్ చాంబర్లో ఈ భేటీ జరిగింది. కెమెరాల ముందే ప్రియాంకా గాంధీ చండీగఢ్–శిమ్లా హైవేపై ఉన్న తీవ్రమైన సమస్యను ప్రస్తావించారు. “కొండచరియలు విరిగే ప్రాంతాల్లోనే రిటైనింగ్ వాల్స్ చాలా తక్కువ ఎత్తులో ఉన్నాయి. దయచేసి దీనిపై దృష్టి పెట్టండి” అని ఆమె మంత్రిని కోరారు. దానికి గడ్కరీ సూటిగా, కొంత ఆకర్షణీయంగా స్పందిస్తూ, “నా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. అపాయింట్మెంట్ అవసరం లేదు” అని అన్నారు.
వాయనాడ్లోని రోడ్డు మౌలిక వసతులకు సంబంధించిన అడ్డంకులు, సమస్యలపై ఇద్దరూ విస్తృతంగా చర్చించారు. ఈ సంభాషణకు సంబంధించిన చిన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వేగంగా వైరల్ అయింది. దీనిపై రాజకీయ వర్గాల్లో సరదా వ్యాఖ్యలు, అలాగే కొందరి నుంచి ప్రశంసలు కూడా వెల్లువెత్తాయి.
