కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల సర్వేయర్ యక్కలదేవి కుమారస్వామిని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు వలపన్ని పట్టుకున్నారు. భూమి సర్వే నిర్వహించేందుకు ఫిర్యాదిదారుడి నుంచి లంచం డిమాండ్ చేసి స్వీకరించిన ఆరోపణలపై ఏసీబీ అధికారులు ఆయనతో పాటు ఇద్దరు ప్రైవేట్ సహాయకులను అరెస్టు చేశారు.
ఏసీబీ వెల్లడించిన వివరాల ప్రకారం, కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం అమ్మన్గుర్తి గ్రామానికి చెందిన ఫిర్యాదిదారుడి భూమికి సర్వే నిర్వహించేందుకు మండల సర్వేయర్ యక్కలదేవి కుమారస్వామి మొత్తం రూ.25 వేల లంచం డిమాండ్ చేశాడు. ఇందులో భాగంగా మే 23న యూపీఐ లావాదేవీ ద్వారా రూ.5 వేల రూపాయలు స్వీకరించినట్లు అధికారులు గుర్తించారు. అనంతరం జూన్ 2న తన ప్రైవేట్ సహాయకుడు వంగా విహిత్ రెడ్డి ద్వారా మరో రూ.10 వేల నగదు తీసుకున్నట్లు దర్యాప్తులో తేలింది.
మిగిలిన రూ.10 వేల లంచం మొత్తాన్ని జూన్ 5న మరో ప్రైవేట్ సహాయకుడు తీగల రాజేష్ ద్వారా స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు పక్కా సమాచారంతో ట్రాప్ నిర్వహించారు. లంచం నగదును స్వీకరించిన వెంటనే రాజేష్ను పట్టుకుని అతని వద్ద నుంచి రూ.10 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.
దర్యాప్తులో మండల సర్వేయర్ కుమారస్వామి తన అధికారిక విధులను నిర్వర్తించేందుకు అక్రమంగా లంచం డిమాండ్ చేసి, తన ప్రైవేట్ సహాయకుల ద్వారా మొత్తాన్ని స్వీకరించినట్లు ఏసీబీ నిర్ధారించింది. ఈ నేపథ్యంలో మండల సర్వేయర్ యక్కలదేవి కుమారస్వామి, ప్రైవేట్ సహాయకులు తీగల రాజేష్, వంగా విహిత్ రెడ్డిలను అరెస్టు చేశారు.
నిందితులను కరీంనగర్లోని అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదిదారుడి వివరాలను గోప్యంగా ఉంచినట్లు ఏసీబీ వెల్లడించింది.
