పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిర్మాణ సంస్థ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ (Pawan Kalyan Creative Works) మరో ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory)తో చేతులు కలిపింది. ఈ రెండు సంస్థలు కలిసి ప్రేక్షకులకు నాణ్యమైన, ఆసక్తికరమైన సినిమాలను అందించేందుకు సిద్ధమవుతున్నాయి.
ప్రతిభావంతులకు తమ సృజనాత్మక కలలను సాకారం చేసుకునే అవకాశం కల్పించాలనే లక్ష్యంతో ఆయన స్థాపించిన ఈ సంస్థలు మంచి కంటెంట్ ఇచ్చేందుకు సంకల్పించాయి. దీనికి సంబంధించి గతంలోనే కథలపై చర్చలు ప్రారంభమైనట్లు సమాచారం. భోగి పండుగ రోజున ఈ చర్చలు మరింత ముందుకు వెళ్లేలా పవన్ కళ్యాణ్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ మరోసారి భేటీ అయ్యారు.
ఈ భేటీ గురించి పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ తమ ఎక్స్ (X) ఖాతాలో ఇలా ట్వీట్ చేసింది: “భోగి పండుగ శుభదినాన కొత్త ఆరంభాల ఆత్మను గుర్తు చేసుకుంటూ, రాబోయే ప్రాజెక్టులపై గతంలో జరిగిన చర్చలను ముందుకు తీసుకెళ్లే భాగంగా @PawanKalyan, @peoplemediafcy నిర్మాత @vishwaprasadtg ని కలుసుకొని మరింత చర్చలు జరిపారు.”
ఈ ట్వీట్కు ప్రతిస్పందనగా నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, “కథలపై చర్చించే అవకాశం ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇది మా కోసం ఎంతో విలువైన విషయం. పీకేడబ్ల్యూసీతో కలిసి బలమైన, అర్థవంతమైన, ప్రభావవంతమైన కంటెంట్ను ప్రేక్షకులకు అందించేందుకు మేము ఉత్సాహంగా ఉన్నాం. ఈ ప్రయాణాన్ని కలిసి ప్రారంభించేందుకు గౌరవంగా భావిస్తున్నాం,” అని అన్నారు.
ఈ సమావేశం పవన్ కళ్యాణ్ అభిమానులు, సినీ పరిశ్రమ వర్గాల్లో విపరీతమైన సానుకూల స్పందనను తెచ్చుకుంది. రాబోయే రోజుల్లో ఈ రెండు శక్తివంతమైన నిర్మాణ సంస్థలు తమ సృజనాత్మక శక్తిని కలిపి మరిన్ని గొప్ప సినిమాలను అందిస్తాయనే ఆశాభావం అందరిలోనూ కనిపిస్తోంది.
