వైసీపీ హయాంలో విద్యారంగం విధ్వంసం గురించి మంత్రి నారా లోకేశ్ శాసనసభ వేదిక సంచలన విషయాలు వెల్లడించారు. జగన్ పాలనలో పది లక్షల మంది విద్యార్ధులను బడులకు దూరం చేశారని తెలిపారు. విద్యార్ధులు ఏ స్కూల్లో చదువుతున్నారో కూడా తెలియకుండా 3 లక్షల మంది వివరాలను డ్రాప్బాక్స్లో ఉన్నట్లు చూపించి.. నిధులు తీసుకున్నారని చెప్పారు.
జీవో 117 ద్వారా ప్రభుత్వ పాఠశాల్లో విద్యా ప్రమాణాలు ఘోరంగా పడిపోయాయి. ఒకే ఒక్క టీచర్ ఉన్న స్కూల్స్ సంఖ్య 12 వేలు దాటిపోయింది. సిబ్బంది లేకపోయినా వైసీపీ హయాంలో టీచర్ల నియామకం కోసం ఒక్క డీఎస్సీ కూడా వేయలేదు.
అప్పట్లో నేషనల్ ఎఛీవ్మెంట్ సర్వేలో దేశంలోని 28 రాష్ట్రాల్లో ఏపీ 27వ స్థానానికి పడిపోయింది. ఐదో తరగతి మ్యాథ్స్ స్కిల్స్లో 2019 వరకు ఐదో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ తర్వాత కాలంలో 21వ ప్లేస్కి పడిపోయింది. దేశంలోనే అతి తక్కువ అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా ఏపీ మిగిలిపోవడానికి వైసీపీ ప్రభుత్వం అసమర్ధతే కారణమని మండిపడ్డారు మంత్రి నారా లోకేశ్.
జగన్ సర్కారు హడావుడిగా తీసుకొచ్చిన సీబీఎస్ఈ స్కూల్స్లో.. మోడల్ టెస్టులు పెడితే ఎక్కువ మంది ఫెయిల్ అయ్యారు. ఇంగ్లీష్ భాషలో శిక్షణ కోసం 59 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన గత ప్రభుత్వం టోఫెల్ పరీక్ష ఒక్కటి కూడా నిర్వహించలేదు. ఐబీ సిలబస్ తీసుకొస్తామని.. రిపోర్టు కోసమే 5 కోట్లు ఖర్చు చేశారు. టీచర్లను మద్యం దుకాణాల దగ్గర కాపాలాదారులుగా పెట్టి వారిని అవమానించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. వైసీపీ పాలనలో జరిగిన తప్పులను సరిదిద్దే పనులు ప్రారంభించింది. ముందు జీవో 117 రద్దు చేశారు. విద్యార్ధుల లెర్నింగ్ సామర్ధ్యాన్ని పెంచడంపై దృష్టి పెట్టి.. మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారు.
వంద శాతం అక్షరాస్యత సాధించే కార్యక్రమాలు అమల్లోకి తీసుకొచ్చారు. ప్రభుత్వం, విద్యా శాఖతో పాటు ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలని సూచించారు మంత్రి నారా లోకేశ్. ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒక్క గవర్నమెంట్ స్కూల్లో అయినా కనీసం వెయ్యి మంది విద్యార్ధులు చదువుకొనేలా చూడాలన్నారు.
వారానికో స్కూల్కి వెళ్లి.. అక్కడి సమస్యల గురించి తనకు మెసేజ్ చేస్తే.. వెంటనే పరిష్కరిస్తామన్నారు. ప్రజల భాగస్వామ్యంతో ఎమ్మెల్యేల కృషితో.. ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖను దేశానికే రోల్ మోడల్గా నిలపడమే లక్ష్యంగా పని చేస్తున్నారు విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్.
