అతడు చేసే పానీపూరీకి ఆ ప్రాంతంలో మంచి పేరుంది. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ అతడి దగ్గరకు వెళ్లేవారు. ఒకటా రెండా.. ఏకంగా 20 ఏళ్లుగా అక్కడే వ్యాపారం చేస్తూ అందరి నమ్మకాన్ని గెలుచుకున్నాడు.
కానీ, చివరకు ఆ నమ్మకాన్నే పెట్టుబడిగా మార్చుకొని సుమారు రూ. 20 లక్షల వరకు టోకరా పెట్టి చల్లగా జారుకున్నాడు. గద్వాల పట్టణంలోని తుల్జారం గుడి సమీపంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
తుల్జారం గుడి సమీపంలో గత రెండు దశాబ్దాలుగా ఓ వ్యక్తి గప్ చుప్ (పానీపూరీ) వ్యాపారం చేస్తున్నాడు. సుదీర్ఘ కాలంగా అక్కడే ఉండటంతో స్థానికులు, చుట్టుపక్కల వ్యాపారులతో అతడికి మంచి పరిచయాలు ఏర్పడ్డాయి.
ఈ క్రమంలో తన అవసరాల కోసమని, వ్యాపార విస్తరణకని నమ్మబలికి పలువురి దగ్గర పెద్ద మొత్తంలో అప్పులు తీసుకున్నాడు. కొందరి వద్ద నగదు రూపంలో, మరికొందరి వద్ద చీటీల రూపంలో మొత్తం కలిపి సుమారు 20 లక్షల రూపాయల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది.
గత కొన్ని రోజులుగా సదరు వ్యాపారి కనిపించకపోవడం, ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో బాధితులకు అనుమానం కలిగింది. తీరా విచారించగా, అతడు తన మకాం మార్చి ఎవరికీ చెప్పకుండా పరారైనట్లు తేలింది.
“20 ఏళ్లుగా మా కళ్ల ముందే ఉంటున్నాడు కదా అని నమ్మి డబ్బులు ఇచ్చాం, ఇలా గప్ చుప్ గా టోకరా పెడతాడని ఊహించలేదు” అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మోసపోయామని గ్రహించిన పేరు చెప్పుకోలేని బాధితులు ఇప్పుడు అతని ఆచూకీ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. 20 ఏళ్ల నమ్మకాన్ని తుంగలో తొక్కిన ఈ పానీపూరీ వ్యాపారి ఉదంతం పట్టణంలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
