హర్షుడు ఆదిత్య విగ్రహ పూజ చేశాడని చరిత్ర చెప్పుతున్నది. ఆ కాలపునాటి మయూర కవి సంస్కృతంలో సూర్య శతకం వ్రాశాడు. సూర్య విగ్రహపూజ ఆరంభ తొలినాళ్ళలో. ఆంధ్రదేశాన ఎక్కువగా సూర్యరథ పూజ జరుగుతుండేది.
క్రీ.శ.మూడు, నాలుగు శతాబ్దులలో కృష్ణా, గోదావరీ మధ్య తీరాన్ని ఏలిన శాలంకాయనులు చిత్రరత స్వామి భక్తులు. ఆరాధిత మూల విగ్రహం సూర్యునిదే అయినా చిత్ర రథ స్వామి అనే పేరు వ్యావహారికమైంది. కవి మారన విరచిత మార్కండేయ పురాణంలో సూర్య స్తుతి రథపరంగా సాగింది.”ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచు” అంటాడు పోతనామాత్యుడు.
మిత్ర, రవి, సూర్య, భాను, ఖగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత, ఆర్క, భాస్కర నామాలతో ద్వాదశాత్మకుడని సూర్యోపాసకులు వర్ణిస్తారు. వివిధ నామాలన్నింటికీ మూలం రథరూప పూజ, రథ సప్తమి అందులోనుండే పుట్టింది.
అదే సూర్య జయంతి. సకల చరాచర జీవరాసుల ప్రాణ ప్రదాతయైన సూర్య భగవానుని జయంతిని “సూర్య జయంతిగా, రథ సప్తమి”గా పేరెన్నికగన్న మాఘ శుక్ల పక్ష సప్తమి నాడు సూర్య రథాలు మళ్ళుతాయని, అవి ఉత్తర గతిని సూచిస్తాయని, ఈదినం సూర్య గ్రహణ తుల్యమైన పుణ్యకాలమని భక్తుల భావన.
