తిరుమల తిరుపతి దేవస్థానాల కార్యనిర్వహణాధికారిగా ముద్దాడ రవిచంద్ర పూర్తి స్థాయి బాధ్యతలు స్వీకరించారు. గత నెల ఫిబ్రవరి 6న ఆయన ఇన్ఛార్జ్ ఈఓగా బాధ్యతలు చేపట్టగా, ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం పూర్తి స్థాయి ఈఓగా బాధ్యతలు చేపట్టినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెల రోజులుగా టీటీడీకి చెందిన వివిధ శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహించి ఆలయ పరిపాలన, కార్యకలాపాలపై సమగ్ర అవగాహన పొందినట్లు చెప్పారు. సామాన్య భక్తుడి దృష్టితో ఆలోచిస్తూ భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు పలువురి సూచనలు స్వీకరించినట్లు పేర్కొన్నారు.
క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను తెలుసుకునేందుకు స్వయంగా వివిధ మార్గాల్లో పరిశీలనలు నిర్వహిస్తానని తెలిపారు. తిరుమలకు వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతి కలిగేలా, సౌకర్యవంతమైన దర్శనం అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే భక్తులకు నాణ్యమైన ప్రసాదాలు అందేలా ప్రత్యేక దృష్టి సారిస్తామని వెల్లడించారు. భక్తుల విశ్వాసాన్ని మరింత బలపరిచే విధంగా టీటీడీ సేవలను మెరుగుపర్చేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఈఓ రవిచంద్ర తెలిపారు.
