విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీ భూముల వ్యవహారంపై మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన విమర్శలకు విశాఖ ఎంపీ శ్రీ భరత్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. జగన్ సోషల్ మీడియా వేదికగా చేసిన ఆరోపణలు పచ్చి అబద్ధాలని, ఒక మాజీ ముఖ్యమంత్రి ఇలాంటి తప్పుడు గణాంకాలతో ప్రజలను తప్పుదోవ పట్టించడం దురదృష్టకరమని మండిపడ్డారు. గీతం సంస్థపై రాజకీయ కక్షతో విషం చిమ్మడం మానుకోవాలని, వాస్తవాలను తెలుసుకుని మాట్లాడాలని జగన్కు హితవు పలికారు.
జగన్ పేర్కొన్న భూముల ధరలపై భరత్ లెక్కలతో సహా వివరణ ఇచ్చారు. ఈ మేరకు సుదీర్ఘమైన ట్వీట్ చేసిన శ్రీ భరత్..గీతం పక్కనే ఉన్న రాజీవ్ స్వగృహ భూములను గత వైసీపీ ప్రభుత్వమే గజం రూ. 60-65 వేలకు వేలం వేసిందని, ఆ లెక్కన చూస్తే ఎకరా రూ. 19.5 కోట్లు అవుతుందని చెప్పారు. కానీ జగన్ ఎకరా రూ. 100 కోట్లు అంటూ రూ. 5000 కోట్ల కుంభకోణం అని పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ జగన్ చెప్పినట్లు భూమి ధర 5 రెట్లు పెరిగింది అనుకుంటే..చంద్రబాబు నాయుడి పాలనలో ఏపీ అభివృద్ధి వేగంగా జరుగుతోందని జగన్ ఒప్పుకున్నట్లేనని ఎద్దేవా చేశారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో గీతం సమీపంలోని 11 ఎకరాల భూమిని TISB అనే ఇంటర్నేషనల్ స్కూల్కు ఎకరా కేవలం కోటి రూపాయలకే ఎందుకు ఇచ్చారని భరత్ ప్రశ్నించారు. జగన్ లెక్క ప్రకారం ఆ భూమి విలువ రూ. 1100 కోట్లు కావాలని, మరి అంత తక్కువ ధరకు ఎందుకు కట్టబెట్టారో సమాధానం చెప్పాలన్నారు. గీతం ఎప్పుడూ భూములను ఉచితంగా అడగలేదని, ప్రభుత్వం నిర్ణయించిన ధర చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని 20 ఏళ్లుగా చెబుతున్నా..కావాలనే వైసీపీ నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
గీతం కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందన్న విమర్శలపైనా స్పందించారు భరత్. కోవిడ్ సమయంలో ఇదే గీతం ఆసుపత్రి సేవలను వైసీపీ ప్రభుత్వం ఎందుకు వాడుకుందని ప్రశ్నించారు. ఆ సమయంలో వేలాది మంది రోగులకు చికిత్స అందించిన సంస్థను ఇప్పుడు విమర్శించడం సరికాదన్నారు. రాజకీయ కక్షల కోసం విద్య, వైద్య రంగాల్లో సేవలందిస్తున్న సంస్థలపై దాడి చేయడం మానుకోవాలన్నారు.
