ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం రేపిన దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ (అనంతబాబు)ను పోలీసులు అరెస్టు చేశారు. జగన్ రెడ్డి సీఎం గా ఉన్న సమయంలో 2022 మే నెలలో దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య జరిగింది. సుబ్రహ్మణ్యంను పిలిపించి వాగ్వాదం అనంతరం అతనిపై దాడి చేసి హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
అనంతరం మృతదేహాన్ని ప్రమాదంలా చూపించే ప్రయత్నం చేశాడని పోలీసులు పేర్కొన్నారు. బాధితుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి అనంతబాబును అప్పటిలో అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు అనంతరం ఆయనను కోర్టులో హాజరు పరచగా, న్యాయస్థానం జ్యుడీషియల్ రిమాండ్కు పంపింది. ఈ కేసు దళిత సంఘాలు, ప్రతిపక్ష పార్టీల ఆందోళనలతో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
అనంతబాబు నేరాన్ని ఒప్పుకున్నట్లు కూడా అప్పట్లో పోలీసులు వెల్లడించారు. ఇప్పటికీ ఈ కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. సుప్రీంకోర్టు కూడా ఈ కేసు దర్యాప్తుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వేగంగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 2026లోపు ట్రయల్ పూర్తి చేయాలని కఠిన గడువులు విధించింది. ఇక తాజా పరిణామాల్లో, ఈ కేసులో అనంతబాబు భార్య పాత్రపై కూడా విచారణ జరుగుతుండగా, ఆమెను రెండో నిందితురాలిగా చేర్చినట్లు దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి.
హత్య అనంతరం ఆధారాలు నాశనం చేయడంలో ఆమె సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. తాజాగా సాక్ష్యులను ప్రభావితం చేసేందుకు అనంతబాబు ప్రయత్నించారు. దీన్ని పోలీసులు విజయవంతంగా ఛేదించారు. అనంతబాబు బెయిల్ ను రద్దు చేయడంతో నేడు పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు నుంచి బయటకు రాగానే అరెస్టు చేశారు. అనంతరం కాకినాడలోని సర్పవరం పోలీస్ స్టేషన్ కు అనంతబాబును తరలించారు.
