వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనలు, ఆయన బెంగళూరు ప్యాలెస్ కేంద్రంగా సాగిస్తున్న మంతనాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్రంలో ఉండకుండా పక్క రాష్ట్రం నుంచి రాజకీయాలు నడపడం వెనుక పక్కా వ్యూహం ఉందని విమర్శలు వస్తున్నాయి. అక్కడి నుంచే సోషల్ మీడియా నెట్వర్క్ ద్వారా తప్పుడు ప్రచారాలు చేయించడం, నేతలకు దిశానిర్దేశం చేస్తూ అశాంతికి పురిగొల్పడం లాంటి చర్యలతో కూటమి ప్రభుత్వంపై బురద జల్లాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయడమే లక్ష్యంగా వైసీపీ దాడులు చేస్తోంది. కూటమి ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షించేందుకు, అభివృద్ధి దిశగా వేగంగా అడుగులు వేస్తున్న సమయంలో శాంతిభద్రతల సమస్యను సృష్టించడం ద్వారా రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీయాలని వైసీపీ ప్రయత్నిస్తోంది. వరుసగా జరుగుతున్న దాడుల వెనుక ఆ పార్టీ కార్యకర్తల ప్రమేయం ఉండటం, వాటిని సోషల్ మీడియాలో వక్రీకరించి చూపడం ద్వారా ఏపీలో అరాచక పాలన సాగుతోందనే భ్రమను కల్పించాలని చూస్తున్నారు. అయితే, ఈ కుట్రల రాజకీయం పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
డైవర్షన్ స్కీమ్…. ఏపీలో వైసీపీ అరాచక రాజకీయం.!
2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం మూట గట్టుకున్న వైసీపీ, ఆ పార్టీ అధినేత జగన్..ఏపీలో అశాంతిని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారా..అంటే అవుననే సమాధానమే వస్తోంది. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత తెచ్చేందుకు వరుస దాడులు, గొడవలను ప్రోత్సహిస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. అలజడి సృష్టించడం ద్వారా ప్రభుత్వ యంత్రాంగానికి చెడ్డ పేరు తీసుకురావాలనేది వైసీపీ పార్టీ ఎత్తుగడగా కనిపిస్తోంది. ఇటీవల జరిగిన అంబటి, జోగి రమేష్ ఘటనలే ఇందుకు ఉదాహరణ.
ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారం వైసీపీకి ఆత్మరక్షణలోకి నెట్టింది. కోట్లాది హిందువుల సెంటిమెంట్తో ముడిపడి ఉన్న కల్తీ నెయ్యి వ్యవహారం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్’కు తెరలేపిందని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. తమ హయాంలో జరిగిన తప్పిదాలు బయటకు రాకుండా ఉండేందుకు, రాష్ట్రంలో ఏదో ఒక చోట గొడవలు సృష్టిస్తూ చర్చను అటు వైపు మళ్లించే కుట్రలు ఇందులో దాగి ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
