ఖమ్మం జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఉద్యోగ విరమణ చేసి ఏడాది దాటినా రావాల్సిన బకాయిలు అందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ, అనారోగ్యంతో బాధపడుతున్న రిటైర్డ్ ఏఆర్ ఎస్సై కె. మైసయ్య మృతిచెందారు. కుటుంబాన్ని ఆదుకోవాల్సిన సమయంలో ఆయన మరణం స్థానికంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది.
మైసయ్య ఖమ్మం పోలీస్ సాయుధ దళంలో ఎస్సైగా సేవలందించి గత ఏడాది ఫిబ్రవరిలో ఉద్యోగ విరమణ పొందారు. ఉద్యోగ విరమణ అనంతరం ఆయనకు సుమారు రూ.50 నుండి 60 లక్షల వరకు బకాయిలు రావాల్సి ఉన్నప్పటికీ, అవి ఇప్పటికీ విడుదల కాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆర్థికంగా ఇబ్బందులు తీవ్రరూపం దాల్చడంతో కుటుంబ పరిస్థితి రోజురోజుకు దిగజారింది.
ఈ క్రమంలో మైసయ్యతో పాటు ఆయన భార్య భాగ్యమ్మ కూడా అనారోగ్యానికి గురయ్యారు. బుధవారం రాత్రి ఇద్దరినీ ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. భాగ్యమ్మ ఆరోగ్యం విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. అదే సమయంలో మైసయ్య పరిస్థితి కూడా ఆందోళనకరంగా మారి, బుధవారం అర్ధరాత్రి తర్వాత ఆయన తుదిశ్వాస విడిచారు.
ఆసుపత్రి బిల్లులు చెల్లించేందుకు కుటుంబం ఇబ్బందులు పడుతోందని తెలిసిన విశ్రాంత పోలీస్ అధికారుల సంఘం కొంతమేర బిల్లు చెల్లించి, మృతదేహాన్ని ఆయన నివాసానికి తరలించేందుకు సహకరించింది.
సేవలో ఉన్నప్పుడు ప్రజలకు అండగా నిలిచిన ఒక పోలీస్ అధికారి, ఉద్యోగ విరమణ అనంతరం బకాయిల కోసం ఎదురుచూస్తూ ఆర్థిక కష్టాల్లో కన్నుమూయడం బాధాకరమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబానికి న్యాయం జరగాలని, పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని పలువురు కోరుతున్నారు.
