హైదరాబాద్లోని ప్రముఖ నిర్మాణ సంస్థ డిఎస్ఆర్ గ్రూప్ కన్స్ట్రక్షన్ కంపెనీ కార్యాలయాలు, డైరెక్టర్ల నివాసాలపై ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ విస్తృత సోదాలు నిర్వహిస్తోంది. డిఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, డిఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలకు చెందిన 10కి పైగా ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు జరుగుతున్నాయి.
ఈ ఐటీ దాడుల్లో ఒక కీలక మలుపు చోటుచేసుకుంది. శ్రీనివాస కన్స్ట్రక్షన్ కంపెనీ కార్యాలయాల్లో కూడా సోదాలు జరుగుతున్నాయి. ఈ సంస్థపై ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కేసులో ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఈ తనిఖీలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
కసిరెడ్డి, శ్రీనివాస కన్స్ట్రక్షన్ కంపెనీల మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ సోదాల పరంపరలో భాగంగా, మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి నివాసం, కార్యాలయాల్లోనూ ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. రంజిత్ రెడ్డి ఫిలింనగర్లో డిఎస్ఆర్ గ్రూప్తో కలిసి ఒక భారీ ప్రాజెక్టును చేపట్టినట్టు సమాచారం.
గతంలో ఈ ఫిలింనగర్ సైట్ పలు వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచింది. రంజిత్ రెడ్డి గత కొన్ని సంవత్సరాలుగా డిఎస్ఆర్ గ్రూప్తో కలిసి పని చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఐటీ దాడులు హైదరాబాద్, నెల్లూరు, చెన్నై, బెంగళూరు సహా 20కి పైగా ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి.
డిఎస్ఆర్ కంపెనీలో వెంకటకృష్ణారెడ్డి భాగస్వామిగా ఉన్నారని, ఆయన ఇంట్లో పలు కీలక పత్రాలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. ఈ సోదాలు మరో రెండు రోజులపాటు కొనసాగే అవకాశం ఉందని ఐటీ వర్గాలు పేర్కొన్నాయి