జాతీయంహోమ్

అప్పుల ఊబిలో కూరుకుపోయిన కేరళ

#KeralaCM

కేరళ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఈ విషయాన్ని కేరళ ముఖ్యమంత్రి వీ డీ సతీషన్ వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర ఒత్తిడిలో ఉందని గురువారం విడుదల చేసిన శ్వేతపత్రంలో పేర్కొన్నారు.

‘కేరళ ఆర్థిక ఆరోగ్యం: స్థితిగతుల నివేదిక’ పేరుతో విడుదలైన ఈ పత్రంలో రాష్ట్రంపై రూ.5.07 లక్షల కోట్ల మేర బాధ్యతలు ఉన్నాయని వెల్లడించారు. మొత్తం ఆదాయ రాబడిలో 77 శాతం భాగం ఇప్పటికే జీతాలు, పెన్షన్లు, వడ్డీ చెల్లింపులు వంటి కట్టుబడి వ్యయాలకే వెళ్తోందని, వడ్డీ చెల్లింపులే మొత్తం ఆదాయ రాబడిలో 20.9 శాతం వాటాను ఆక్రమిస్తున్నాయని పేర్కొన్నారు.

అత్యధిక ఆర్ధిక లోటు ఉన్న రాష్ట్రం కేరళ

రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో మూలధన వ్యయం కేవలం 1.3 శాతంగా ఉండటం దేశంలోని రాష్ట్రాల్లోనే అత్యల్ప స్థాయిల్లో ఒకటిగా ఉందని శ్వేతపత్రం పేర్కొంది. అదే సమయంలో కేరళ అత్యధిక ఆర్థిక లోటు ఉన్న రాష్ట్రాల్లో ఒకటిగా కొనసాగుతోందని వెల్లడించింది. అప్పులు తీసుకుని పెట్టుబడులు పెట్టి అభివృద్ధి ద్వారా వాటిని తిరిగి చెల్లించాలనే ప్రాథమిక ఆర్థిక సూత్రాన్ని కేరళ ప్రభుత్వం పాటించలేకపోయిందని, దీంతో రాష్ట్ర వృద్ధి సామర్థ్యం బలహీనపడిందని శ్వేతపత్రంలో పేర్కొన్నారు.

ప్రత్యేకంగా Kerala Infrastructure Investment Fund Board వంటి సమాంతర పాలనా వ్యవస్థలు రాష్ట్ర ఆర్థిక ఒత్తిడిని మరింత పెంచాయని శ్వేతపత్రం ఆరోపించింది. ఒకవైపు ఆదాయ ప్రవాహాన్ని తగ్గించడంతో పాటు మరోవైపు భారీ స్థాయి బాధ్యతలను సృష్టించాయని పేర్కొంది. కేరళలో కట్టుబడి వ్యయాల భారం జాతీయ సగటు 46.1 శాతం కంటే దాదాపు ఒకటిన్నర రెట్లు ఎక్కువగా ఉందని తెలిపింది.

సంక్షేమ పథకాలకు డబ్బులు లేవు….

ఈ పరిస్థితి కారణంగా పాఠశాలలు, ఆసుపత్రులు, రహదారులు, సంక్షేమ కార్యక్రమాలు, స్థానిక సంస్థలకు మద్దతు వంటి కీలక రంగాల కోసం ప్రతి నాలుగు రూపాయల్లో కేవలం ఒక రూపాయి మాత్రమే మిగులుతోందని శ్వేతపత్రం పేర్కొంది. రాష్ట్ర స్వంత పన్ను ఆదాయంలో కీలక భాగమైన జీఎస్‌టీలో కూడా ఇటీవలి సంవత్సరాల్లో ఆశించిన స్థాయి వృద్ధి కనిపించలేదని, అన్ని రాష్ట్రాల సగటుతో పోలిస్తే కేరళ వెనుకబడి ఉందని తెలిపింది.

అయితే ఈ శ్వేతపత్రంపై వామపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. మాజీ ఆర్థిక మంత్రి కె ఎన్ బాలగోపాల్ మాట్లాడుతూ, ప్రభుత్వ అంతర్గత వ్యవహారాలను వెల్లడి చేసి బయటి వ్యక్తులతో ఈ శ్వేతపత్రాన్ని సిద్ధం చేశారని ఆరోపించారు. ఇది రాజ్యాంగ నిబంధనలు, అధికార గోప్యతా చట్టం, పదవీ ప్రమాణ స్వీకారానికి విరుద్ధమని అన్నారు.

ఇంతకుముందు అన్ని శ్వేతపత్రాలను ఆర్థిక శాఖే సిద్ధం చేసేదని, తాజా నివేదిక మాత్రం రాజకీయ పత్రంలా కనిపిస్తోందని బాలగోపాల్ విమర్శించారు. ఈ పత్రాన్ని సభలో ప్రవేశపెట్టడానికి అనుమతిస్తే భవిష్యత్తులో తప్పు సంప్రదాయానికి నాంది పలికినట్లవుతుందని హెచ్చరించారు.

అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ కూడా ఇదే అంశంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆర్థిక శాఖ తయారు చేయకుండా శ్వేతపత్రాన్ని రూపొందించడం ఆశ్చర్యకరమని, ఇది ఆందోళన కలిగించే విషయమని ఆయన వ్యాఖ్యానించారు.

Related posts

జనసేన ఎమ్మెల్యేలు జాగ్రత్త: పవన్

Satyam News

ముంచుకొస్తున్న ‘మొంథా’ తుఫాన్

Satyam News

గద్దర్ అవార్డ్ ఇచ్చిన ఉత్తేజంతో త్వరలో రెండో చిత్రం

Satyam News

విద్యుత్ కొనుగోలు ఛార్జీలు తగ్గించేలా ప్రణాళికలు

Satyam News

విశాఖ నగరంలో వెహికల్ రిటర్న్ మేళా

Satyam News

జాతీయ ఆరోగ్య వేదిక‌లో ‘సంజీవ‌ని’ పై చ‌ర్చ‌

Satyam News

Leave a Comment