తూర్పుగోదావరి హోమ్

గోదావరి పుష్కరాలపై అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి

రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (RUDA) పరిధిలో మౌలిక వసతుల అభివృద్ధికి అధికారులు ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ అన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆదివారం రుడా మాస్టర్ ప్లాన్, గోదావరి పుష్కరాలపై జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతితో కలిసి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌లో రుడా ప్రతిపాదిత అంశాలపై వివరించారు. 3,156 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంతో మాస్టర్‌ప్లాన్‌ రూపొందించవలసి ఉండగా.. ప్రస్తుతం 1,005 చదరపు కిలోమీటర్లతో మాస్టర్‌ ప్లాన్‌ డ్రాఫ్ట్‌ సిద్ధంగా ఉన్నట్లు అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

మిగిలిన ప్రాంతాలను కూడా అనుసంధానం చేస్తూ సమగ్ర మాస్టర్‌ప్లాన్‌ రూపొందించాలని ఈ సందర్భంగా మంత్రి ఆదేశించారు. మాస్టర్ ప్లాన్‌ పై ఉన్న అభ్యంతరాలను నోటిఫై చేయాలన్నారు. రుడా పరిధిలోని పంచాయతీలు, మునిసిపాలిటీల పరిధిలో ప్రధానంగా కనీస మౌలిక సదుపాయాలైన రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీరు, వీధి దీపాలపై దృష్టి సారించాలని సూచించారు.

ఏ పంచాయతీ, ఏ మునిసిపాలిటీ నుంచి వచ్చే ఆదాయాన్ని కచ్చితంగా అవే పంచాయతీలు, మునిసిపాలిటీల అభివృద్ధికే ఖర్చు చేయాలని స్పష్టం చేశారు. రుడా పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు భూములను గుర్తించి ల్యాండ్ బ్యాంక్ ను సిద్ధం చేసుకోవాలని.. తద్వారా ఆయా భూములను పీపీపీ విధానంలో అభివృద్ధి చేయడం ద్వారా స్థానిక సంస్థలు ఆదాయాన్ని సమకూర్చవచ్చన్నారు.

రాబోయే గోదావరి పుష్కరాల నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని విస్తృత ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని మంత్రి నారాయణ సూచించారు. పుష్కర యాత్రికుల కోసం విస్తృత పరిచి రహదారుల అభివృద్ధి, ప్రత్యేక మార్గాల ఏర్పాటు, ఘాట్ల వద్ద ఆధునిక సదుపాయాల కల్పన, పారిశుధ్యం మరియు భద్రతా చర్యలు చేపట్టాలన్నారు.

అలాగే పీపీపీ విధానంలో హోటల్ మేనేజ్‌మెంట్, రెస్టారెంట్లు, సంబంధిత సేవల కోసం ప్రైవేట్ భాగస్వామ్యాలను ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు. అధికారులు ఆశావహ దృక్పథంతో సమగ్ర చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ,మంత్రి సూచనల మేరకు రుడా పరిధిలో ప్రాథమిక మౌలిక వసతుల అభివృద్ధి ప్రాధాన్యంగా చేపడతామని తెలిపారు. లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (LRS), బిల్డింగ్ పెనాల్టీ స్కీమ్ (BPS) ద్వారా వచ్చే నిధులను రహదారులు, మురుగు కాలువలు వంటి పనులకు వినియోగిస్తా మన్నారు.

గోదావరి పుష్కరాల దృష్ట్యా యాత్రికుల సౌకర్యం కోసం ఘాట్ల అభివృద్ధి, విస్తృత రహదారులు, పారిశుధ్యం వంటి ఏర్పాట్లు సమయానికి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

సమీక్షలో రుడా వైస్ ఛైర్మన్, జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు, సెక్రటరీ ఎం.వి.ఆర్ సాయిబాబ, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ జి.వి.ఎస్.ఎన్. మూర్తి, రుడా ప్లానింగ్ ఆఫీసర్ ఎన్.శ్రీనివాస్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

Related posts

ఎర్ర చందనం స్మగ్లర్ల వేట

Satyam News

గాజువాక జింక్ రోడ్డులో కారు నుంచి మంటలు

Satyam News

విజయనగరం లో మోడీ ఫ్లెక్సీ తొలగింపు

Satyam News

Leave a Comment

error: Content is protected !!