ఆందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ జోగిపేట మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపిన ఆయన, ఈ గెలుపు ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చింది కాదని విమర్శించారు.
పట్టణ ప్రజల కనీస సౌకర్యాలు, సంక్షేమ పథకాల అమలులో ప్రస్తుత ప్రభుత్వం విఫలమైందని ప్రజలకు వివరించడంలో తమ అభ్యర్థులు సఫలమయ్యారని, ప్రజల భరోసా బీఆర్ఎస్ వైపే ఉందని ఆయన పేర్కొన్నారు.
మంత్రి దామోదర్ రాజనర్సింహ వారం రోజుల పాటు పట్టణంలోనే ఉండి, కోట్ల రూపాయలను నీళ్ళలా ఖర్చు చేసి ఓటర్లను మభ్యపెట్టారని క్రాంతి కిరణ్ ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు డబ్బులతో ఓట్లను కొనుగోలు చేశారని, అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తూ ఎన్నికల వ్యవస్థను భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు జేబుల్లో లక్షలాది రూపాయలు పెట్టుకుని ఓటర్లకు పంచుతూ, బైక్లపై మద్యం సీసాలు సరఫరా చేస్తూ అప్రజాస్వామికంగా వ్యవహరించారని ఆయన మండిపడ్డారు.
మంత్రి బెదిరింపులకు భయపడకుండా, ప్రలోభాలకు లొంగకుండా పార్టీ పక్షాన నిలిచిన కార్యకర్తలకు, ప్రచారంలో పాల్గొన్న వారికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
బీఆర్ఎస్ అభ్యర్థులు ఓడిపోయినా అధైర్యపడకుండా నిత్యం ప్రజల మధ్యే ఉంటూ, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటారని స్పష్టం చేశారు. గెలిచిన అభ్యర్థులకు అభినందనలు తెలుపుతూనే, ఇప్పటికైనా పట్టణ ప్రజల కనీస అవసరాలను తీర్చడానికి కృషి చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
