సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి మాజీ ఐపీఎస్ అధికారి, జేడీ లక్ష్మీనారాయణ భార్య ఊర్మిళ భారీగా నగదును పోగొట్టుకున్నారు అనే వార్త బయటకు వచ్చిన దగ్గర నుంచి పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
లక్ష్మీనారాయణ ఎన్నికల అఫిడవిట్ లో చెప్పిన లెక్కలకు ఈ సైబర్ క్రైమ్ లో పోగొట్టుకున్న లెక్కలకు పొంతన కనిపించడం లేదు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో మోసగాళ్లు ఆయన భార్య నుండి ఏకంగా రూ.2.58 కోట్లు కాజేశారు అని చెబుతున్నారు.
తమ సూచనల ప్రకారం పెట్టుబడి పెడితే అతి తక్కువ కాలంలోనే ఊహించని లాభాలు వస్తాయని నమ్మబలుకుతూ సైబర్ నేరగాళ్లు ఊర్మిళ వాట్సప్కు మెసేజ్లు పంపారు.
వారి మాటలు నమ్మిన ఆమె ‘స్టాక్ మార్కెట్ ప్రాఫిట్ గైడ్ ఎక్స్ఛేంజ్ 20’ అనే వాట్సాప్ గ్రూప్లో చేరారు.ట్రేడింగ్పై ఊర్మిళకు పెద్దగా అవగాహన లేకపోవడాన్ని ఆసరాగా చేసుకున్న దినేష్ సింగ్ అనే వ్యక్తి, కొన్ని నకిలీ స్క్రీన్ షాట్లను చూపిస్తూ పెట్టుబడి పెడితే 500 శాతం లాభాలు వస్తాయని ఆమెను నమ్మించాడు.
ఈ క్రమంలోనే ఆ ముఠాలోని ప్రియసఖి అనే మరో సభ్యురాలు కూడా తనకు భారీగా లాభాలు వచ్చాయంటూ గ్రూపులో సందేశాలు పెట్టి ఊర్మిళను తప్పుదోవ పట్టించింది. వీరి మాటలను నిజమని నమ్మిన ఊర్మిళ, యాపిల్ యాప్ స్టోర్ నుండి ‘MCKIEY CM’ అనే అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకున్నారు.
గత ఏడాది డిసెంబర్ 24 నుంచి ఈ ఏడాది జనవరి 5వ తేదీ మధ్యలో విడతల వారీగా మొత్తం రూ.2.58 కోట్లను నిందితులు సూచించిన ఖాతాలకు బదిలీ చేశారు. ఈ మొత్తం కోసం ఆమె తన వద్ద ఉన్న బంగారంతో పాటు, భర్త లక్ష్మీనారాయణకు సంబంధించిన బంగారాన్ని కూడా తాకట్టు పెట్టారు.
అయితే, యాప్లో లాభాలు కనిపిస్తున్నప్పటికీ, ఆ డబ్బును విత్డ్రా చేసుకునే అవకాశం లేకపోవడంతో తాను మోసపోయానని ఊర్మిళ గ్రహించారు. వెంటనే ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రంగంలోకి దిగిన పోలీసులు, నిందితులు ఆ నగదును వివిధ మ్యూల్ ఖాతాలకు మళ్లించినట్లు గుర్తించి, వారిని పట్టుకునేందుకు దర్యాప్తు వేగవంతం చేశారు.ఐతే ఇంత పెద్ద మొత్తం లో వారికి డబ్బులు ఎక్కడ నుండి వచ్చాయో ఎవరికీ అర్థం కావడం లేదు.
