వనపర్తి, పెబ్బేరు మున్సిపల్ చైర్ పర్సన్ పీఠాలను బీసీలకే ఇవ్వాలని బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ డిమాండ్ చేశారు. ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వనపర్తి మున్సిపాలిటీలో ఉన్న 33 వార్డుల్లో బీసీలు 25 మంది కౌన్సిలర్లుగా గెలుపొందారని, న్యాయబద్దంగా బీసీ సామాజిక వర్గానికే చైర్ పర్సన్ పదవిని ఇవ్వాలని అన్నారు.
అలా కాకుండా ఇతర సామాజిక వర్గానికి చైర్ పర్సన్ పదవి ఇస్తే బీసీలకు అన్యాయం చేయడమే అవుతుందన్నారు.
రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వనపర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మేఘారెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ పదవితో పాటు డీసీసీ పదవి కూడా శివసేనారెడ్డికి ఇలా ఒకే సామాజిక వర్గానికి దక్కిందని, అంతేకాకుండా పెబ్బేరు మార్కెట్ యార్డ్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు కూడా వారికే కేటాయించుకున్నారని గుర్తు చేశారు.
గడిచిన ఈ రెండేళ్లలో కేవలం ఒక్క వనపర్తి మార్కెట్ యార్డు చైర్మన్ పదవి మాత్రమే బీసీలకు ఇచ్చారని, ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల్లో బీసీల కౌన్సిల్ సంఖ్యను గుర్తించాలన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో జనాభా దామాషా ప్రకారం అన్ని వర్గాలకు సమన్యాయం చేకూరుతుందని ప్రజల్లో నమ్మకం కలిగించాల్సిన బాధ్యత నాయకులపై ఉందని, అలాకాకుండా డబ్బుకు, పలుకుబడికి ప్రాధాన్యత కల్పిస్తే ప్రజల్లో విశ్వసనీయత కోల్పోతామని హితవు పలికారు.
ఈ కార్యక్రమంలో బీసీ పొలిటికల్ జేఏసీ నాయకులు వివి గౌడ్, దేవర శివ, మహేందర్ నాయుడు, ధర్మేంద్ర సాగర్, బత్తుల జితేందర్, అస్కని రమేష్, యశ్వంత్, చెలిమిల్ల రామన్ గౌడ్, కృష్ణ ప్రసాద్, నరేందర్ సాగర్, రమేష్ గౌడ్ పాల్గొన్నారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్
