మేడారం జాతర సమయంలో చోటుచేసుకున్న “కోవా బన్” ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన ఈ వేడుకలో అనేక మంది చిరు వ్యాపారులు తమ జీవనోపాధిని కొనసాగిస్తుంటారు.
అలాంటి వారిలో వలీ అనే యువ వ్యాపారి కూడా ఒకరు. కేవలం రూ.10కే కోవా బన్ విక్రయిస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్న సమయంలో ఒక యూ ట్యూబ్ ఛానల్ ప్రతినిధుల ప్రవర్తన అతనికి తీవ్ర మనోవేదన కలిగించింది.
“ఇంత తక్కువ ధరకు ఎలా ఇస్తావు?” అన్న ప్రశ్నతో ప్రారంభమైన ఇంటర్వ్యూ, అతని మతాన్ని ప్రస్తావిస్తూ వివాదాస్పదంగా మారింది. వ్యూస్, లైక్స్ కోసం ఒక శ్రమజీవిని అవమానించడం సమాజంలో విద్వేషాన్ని రెచ్చగొట్టే చర్యగా నెటిజన్లు తీవ్రంగా ఖండిస్తున్నారు.
“నిజాయితీగా కష్టపడే వ్యక్తిని ప్రశంసించకపోయినా పర్లేదు, కానీ మతాన్ని లాగడం అన్యాయం” అంటూ సోషల్ మీడియాలో ఆగ్రహం వెల్లువెత్తింది.
ఈ విషయం ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి చేరడంతో ఆయన స్పందించారు.
“ప్రియమైన సోదరుడు వలీ… నువ్వు ఎదుర్కొన్న వివక్షకు నేను బాధపడుతున్నాను. మన తెలుగు సమాజం సామరస్యానికి ప్రతీక. త్వరలోనే నిన్ను కలిసి నీ ఫేమస్ కోవా బన్ రుచి చూస్తాను. మేమంతా నీకు తోడుగా ఉన్నాం” అంటూ ట్వీట్ చేసి ఆయన మానవత్వానికి నిదర్శనం చూపారు.
లోకేష్తో పాటు పలువురు రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు కూడా వలీకి మద్దతు ప్రకటిస్తూ, మత విద్వేషాన్ని రెచ్చగొట్టిన ఛానల్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
