ఖమ్మం నగర శివారులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెలగుమట్ల వినోబా నగర్ ప్రాంతంలోని భూదాన్ భూముల్లో నిర్మించుకున్న పేదల ఇండ్లపై అధికారులు కూల్చివేత చర్యలు చేపట్టారు. నాలుగు జిల్లాల నుంచి వేలాది మంది పోలీసులను మోహరించి ఉదయం నుంచే ఆపరేషన్ ప్రారంభించారు. భారీ యంత్రాలతో ఇళ్లు కూల్చివేయడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
“రేవంతన్న, శీనన్న అని ఓటు వేసినందుకు ఇదే శాస్తినా?” అంటూ బాధితులు కన్నీళ్లు పెట్టుకున్నారు. అప్పులు చేసి ఇళ్లు నిర్మించుకున్నామని, ఒక్కసారిగా ఖాళీ చేయమంటే తమ బ్రతుకు ఏంటని ప్రశ్నించారు. నిర్వాసిత కాలనీ యువకులు కర్రలతో పోలీసులను ప్రతిఘటించేందుకు సిద్ధపడగా, ఉద్రిక్తత మరింత పెరిగింది. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
కవరేజ్కు వెళ్తున్న మీడియా ప్రతినిధులను కూడా ఎక్కడికక్కడ అడ్డుకున్నట్లు సమాచారం. “మీడియాకు అనుమతి లేదని పైనుంచి ఆదేశాలు ఉన్నాయి” అని కొందరు పోలీసు అధికారులు పేర్కొన్నారు.
