సామాజిక కార్యకర్త, విద్యావేత్త, తూప్రాన్ పరిరక్షణ సమితి అధ్యక్షులు కె శ్రీనివాసాచారి రచించిన “21వ శతాబ్దంలో మానవవాదం” అనే రచనను తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి రాష్ట్ర సచివాలయంలో ఆవిష్కరించారు. అనంతరం, తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలో గత అనేక సంవత్సరాలుగా స్వచ్ఛందంగా అవినీతి వ్యతిరేక పోరాటం చేస్తూ ప్రజల సమస్యలపై నిరంతరం పనిచేస్తున్న కె. శ్రీనివాసాచారి ని కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
గజ్వేల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఇన్చార్జ్, సిద్ధిపేట జిల్లా ప్రాదేశిక కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తూంకుంట నర్సారెడ్డి సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. తూప్రాన్ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ జ్యోతి కృష్ణ ముదిరాజ్, నాగరాజు గౌడ్, జింక మల్లేష్ మరియు జిల్లా స్థాయి కాంగ్రెస్ కార్యకర్తల ఆధ్వర్యంలో కార్యకర్తల కోరిక మేరకు శ్రీనివాసాచారి ని పార్టీలో చేర్చుకున్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారం, పారదర్శక పరిపాలన కోసం శ్రీనివాసాచారి అనుభవం మరియు సేవలు పార్టీకి మరింత బలం చేకూరుస్తాయని తెలిపారు. గత మున్సిపల్ ఎన్నికల్లో శ్రీనివాసాచారి ఒకటవ వార్డులో చేసిన వీరోచిత ప్రచారం కారణంగా ఓటు బ్యాంకు బాగా పెరిగిందని, ఆయన తోడ్పాటు కాంగ్రెస్ పార్టీకి అవసరమని భావించిన అధినాయకత్వం గత కొంతకాలంగా శ్రీనివాసాచారితో సంప్రదింపులు జరుపుతున్నారు.
అందరితో, అన్ని సంస్థలతో, అన్ని పార్టీల నాయకులతో సఖ్యంగా ఉంటూ వస్తున్న శ్రీనివాసాచారి, ప్రజాస్వామ్య సంస్కరణలకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ, ఆయన రాజకీయాల్లోనూ క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. 2009 నుండి తూంకుంట నర్సారెడ్డి తో సన్నిహితంగా ఉంటూ వస్తున్న శ్రీనివాసాచారి ప్రజాపక్షం వహించి, ప్రజా సమస్యల్ని పరిష్కరించేందుకు, తూప్రాన్, గజ్వేల్ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ప్రజలు, ఓటర్లు, అన్ని పార్టీల కార్యకర్తలు కోరుతున్నారు.
