కూటమి పాలనలో రాష్ట్రం మొత్తం అక్రమ అరెస్టులు దాడులే జరుగుతున్నాయని వైసీపీ పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం గుంటూరు రోడ్డులోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ గోపిరెడ్డి మాట్లాడారు.
కొన్ని పత్రికలలో ఇటీవల అరెస్టు అయిన కర్నాటి వీరభద్రరావు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరులని ప్రచారం చేయటం ఘోరమన్నారు. వీరభద్రరావు టిడిపి సానుభూతిపరుడని, క్రోసూరు మండలానికి చెందిన వ్వక్తి అన్నారు. దీంతో పాటు 2018 – 19 సంవత్సరాలలో జరిగిన సంఘటనకు సంబంధించి అప్పటి డిఎస్పి పల్లమరాజు, పిడుగురాళ్ల ఎస్ఐ రబ్బానీ పైన కేసు నమోదు చేయడం దారుణం అన్నారు.
తెలుగుదేశం ముఠాల మధ్య జరిగిన హత్యలకు సంబంధించి ఇప్పటికే పిన్నెల్లి సోదరులపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపారన్నారు. 93 రోజులు గడుస్తున్న నేటికీ బెయిల్ ఇవ్వకపోవడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. బెయిల్ వచ్చే సమయానికి పిటీషన్లు వేసి పోలీసులు విచారణ పేరుతో బెయిల్ ను తిరస్కరించి ప్రభుత్వమే అడ్డుకుంటున్నారని తెలిపారు.
అదేవిధంగా వైయస్సార్సీపి సోషల్ మీడియా యాక్టివిస్టు మాబుపై పిడి యాక్ట్ బనాయించడం జరిగిందన్నారు. పల్నాడులో మందా సాల్మన్ హత్య అనంతరం సైతం అక్కడి వైసిపి నాయకులపై దాడులు చేసి కాళ్లు చేతులు విరగ్గొడుతున్నారని విమర్శించారు. పిన్నెల్లి సోదరుల బెయిల్ కోసం సుప్రీం కోర్టుకు సైతం వెళతామని డాక్టర్ గోపిరెడ్డి ప్రకటించారు.
విలేకరుల సమావేశంలో వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఎనుముల మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ దాడులు చేస్తున్న వారిని, వారికి సహకరించే వారిపైన, అక్రమ కేసులు పెడుతున్న పోలీసు అధికారులను భవిష్యత్తులో వదిలిపెట్టబోమన్నారు. చట్ట ప్రకారం వారికి శిక్షలు పడే విధంగా చేస్తామని హెచ్చరించారు.
