సామాజిక మాధ్యమాల్లో తనదైన వీడియోలతో గుర్తింపు తెచ్చుకున్న యువ యూట్యూబర్ కోమలి (21) మణికొండలోని చిత్రపురి కాలనీలో ఆత్మహత్యకు పాల్పడింది. ఎవరూ లేని సమయంలో ఆమె తన గదిలో ఉరివేసుకుని ప్రాణాలు విడిచింది. బుధవారం ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
విశాఖపట్నంకు చెందిన కోమలి, హైదరాబాద్లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో బీఎస్సీ చదువుతూనే యూట్యూబర్గా రాణిస్తోంది. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం ఆమె గత మూడేళ్లుగా నిఖిల్ (అఖిల్) రెడ్డి అనే మరో యూట్యూబర్తో ప్రేమలో ఉంది. అయితే, ఏడాది క్రితం వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోయినట్లు తెలుస్తోంది. బ్రేకప్ తర్వాత కోమలి తీవ్ర మనస్తాపానికి గురైందని, ఆరు నెలల క్రితం కూడా ఒకసారి ఆత్మహత్యాయత్నం చేసిందని సమాచారం.
కోమలి రాసిన సూసైడ్ నోట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో తన వేదనను వ్యక్తం చేస్తూ.. “నేను జీవితంలో ముందుకు సాగడానికి భయపడుతున్నాను. అతను నావాడు కాదని, నాతో ఉండాలని అనుకోవడం లేదని నాకు తెలుసు. కానీ నా మనసు ఇంకా అతని కోసమే ఎదురుచూస్తోంది. ఒకవేళ నేను తనని వదిలేసి వెళ్ళిపోయిన క్షణంలో అతను తిరిగి వస్తే ఏంటి పరిస్థితి? అందుకే ముందుకు వెళ్లలేకపోతున్నాను” అని రాసినట్లు తెలుస్తోంది.
కోమలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. తన కూతురి మరణానికి నిఖిల్ రెడ్డి వేధింపులే కారణమని ఆమె ఆరోపించడంతో, పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
కోమలి ఇటీవల తిరుమల మెట్ల దారిలో ప్రతి మెట్టుకూ బొట్టు పెడుతూ చేసిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. అదే ఆమె చివరి వీడియో కావడంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
