మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు కేవలం ప్రాంతీయ సమస్యగా కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపే స్థాయికి చేరుతున్నాయి. ఇంధన ధరలు పెరగడం, సరఫరా లోపాలు, అంతర్జాతీయ మార్కెట్లలో అస్థిరత వంటి ప్రభావాలు మరింత తీవ్రం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మధ్యప్రాచ్యంలో యుద్ధ పరిస్థితులు రోజురోజుకు మరింత తీవ్రమవుతున్నాయి. ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య జరుగుతున్న ఘర్షణలు ఇప్పుడు గల్ఫ్ దేశాల ఇంధన మౌలిక వసతులపై ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నాయి. ఈ పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా ఆయిల్, గ్యాస్ సరఫరాపై తీవ్ర ఆందోళనలకు దారి తీస్తున్నాయి.
తాజా పరిణామాల ప్రకారం, ప్రపంచంలో అతిపెద్ద గ్యాస్ నిల్వలలో ఒకటైన South Pars Gas Field పై అమెరికా-ఇజ్రాయిల్ సంయుక్త దాడులు జరిగాయని వార్తలు వెలువడుతున్నాయి. ఈ దాడుల్లో గ్యాస్ మౌలిక వసతులకు భారీ నష్టం వాటిల్లినట్లు సమాచారం. ఈ దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ సైనిక అధికారులు గల్ఫ్ ప్రాంత దేశాలకు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని ఆయిల్, గ్యాస్ వెలికితీత కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటామని ముందుగానే హెచ్చరించారు. స్థానిక ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటూ సూచనలు ఇచ్చినట్లు సమాచారం.
హెచ్చరికల అనంతరం ఖతార్లోని రాస్ లఫన్ ప్రాంతంలో ఉన్న భారీ ఎల్ఎన్జీ కేంద్రంపై దాడులు జరిగినట్లు సమాచారం. ఇదే ప్రాంతం ప్రపంచ గ్యాస్ సరఫరాలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ దాడులతో అక్కడ భారీ మంటలు చెలరేగిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే సౌదీ అరేబియాలోని కొన్ని రిఫైనరీలు, ఆయిల్ కేంద్రాలపై కూడా దాడులు జరిగాయని అంతర్జాతీయ మీడియా నివేదికలు సూచిస్తున్నాయి.
ఈ దాడులతో గ్లోబల్ ఎనర్జీ సరఫరా గొలుసు తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రపంచ దేశాలు ప్రత్యామ్నాయ ఇంధన వనరుల కోసం ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. ముఖ్యంగా రష్యా వంటి దేశాలపై ఆధారపడే అవకాశాలు పెరుగుతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఆర్థికంగా నష్టపోయిన రష్యాకు ఇది ఆర్థిక లాభం తీసుకురావచ్చని భావిస్తున్నారు. మరోవైపు హోర్మోస్ జల సంధి భద్రతపై కూడా అనిశ్చితి నెలకొంది. ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన ఈ మార్గం ద్వారా రవాణా అంతరాయం కలిగితే గ్లోబల్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.
