ముంబైలోని ప్రతిష్టాత్మక వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026 రెండో సెమీఫైనల్లో భారత్ 7 పరుగుల తేడాతో ఇంగ్లాండ్పై ఉత్కంఠభరిత విజయాన్ని నమోదు చేసింది.
ఈ విజయంతో టీమిండియా నాలుగోసారి టీ20 ప్రపంచ కప్ ఫైనల్కు దూసుకెళ్లింది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకోగా, భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగుల భారీ స్కోరును సాధించింది.
ఇది టీ20 ప్రపంచ కప్ నాకౌట్ చరిత్రలోనే అత్యధిక స్కోరు కావడం విశేషం. భారత ఇన్నింగ్స్లో సంజు శాంసన్ 42 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 89 పరుగులు చేసి అద్భుత ప్రదర్శన కనబరిచాడు. అతడికి తోడుగా ఇషాన్ కిషన్ (39), శివం దూబే (43), హార్దిక్ పాండ్యా (27), తిలక్ వర్మ (21) మెరుపు ఇన్నింగ్స్లు ఆడటంతో భారత్ ఈ రికార్డు స్కోరును నమోదు చేసింది.
భారత బ్యాటర్లు ఈ మ్యాచ్లో మొత్తం 19 సిక్సర్లు బాది సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పారు.
254 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు చివరి వరకు పోరాడి 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ యువ బ్యాటర్ జాకబ్ బెథెల్ కేవలం 48 బంతుల్లోనే 105 పరుగులు చేసి సెంచరీతో భారత బౌలర్లకు చెమటలు పట్టించాడు.
ఒక దశలో ఇంగ్లాండ్ గెలుస్తుందనిపించినా, భారత బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా కీలక సమయాల్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి పరుగులను నియంత్రించారు. బుమ్రా 4 ఓవర్లలో 33 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీయగా, హార్దిక్ పాండ్యా 38 పరుగులకు 2 వికెట్లు పడగొట్టాడు. ఫీల్డింగ్లో అక్షర్ పటేల్ పట్టిన రెండు అద్భుతమైన క్యాచ్లు మ్యాచ్ మలుపు తిప్పాయి.
ఆఖరి ఓవర్లో ఇంగ్లాండ్ విజయానికి 30 పరుగులు అవసరం కాగా, బెథెల్ రనౌట్ కావడంతో భారత్ విజయం ఖాయమైంది. అద్భుత బ్యాటింగ్తో ఆకట్టుకున్న సంజు శాంసన్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ విజయంతో భారత్ మార్చి 8న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఫైనల్లో న్యూజిలాండ్తో తలపడనుంది.
