పల్నాడు జిల్లాలో ఎస్పీ కార్యాలయంలో ఉద్రిక్తత నెలకొంది. నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబుకు జిల్లా ఎస్పీకీ మధ్య వాగ్వాదం చెలరేగడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎమ్మెల్యే అక్కడ ఉండగానే ఎస్పీ ఆఫీసు నుంచి బయటకు వెళ్లిపోవడంతో అక్కడ ఎమ్మెల్యే ధర్నాకు దిగారు.
లాయర్లతో కలిసి జిల్లా ఎస్పి కార్యాలయానికి చేరుకున్న ఎమ్మెల్యే అరవిందబాబు లీగల్ అడ్వైజర్ పోస్టింగ్ అంశంపై ఎస్పితో చర్చించారు. ఈ సందర్భంగా లీగల్ అడ్వైజర్ నియామకం విషయంపై ఇప్పటికే తమ దృష్టిలో ఉందని ఎస్పీ ఎమ్మెల్యేకి తెలియజేశారు.
అయితే, ఈ పోస్టింగ్ భర్తీలో తీవ్ర జాప్యం జరుగుతోందని ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎనిమిది నెలలుగా ఈ అంశంపై కార్యాలయానికి తిరుగుతున్నామని, అయినప్పటికీ తుది నిర్ణయం ఎందుకు తీసుకోలేదని ఆయన ఎస్పీని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా ఎస్పీ కార్యాలయ లీగల్ సెల్ అడ్వైజర్ పోస్టింగ్ అంశంపై ఎమ్మెల్యే, ఎస్పీ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఎనిమిది నెలల క్రితమే పోస్టింగ్కు సంబంధించిన సిఫార్సు లేఖ ఎస్పీ కార్యాలయానికి వచ్చినప్పటికీ, ఇప్పటివరకు నిర్ణయం తీసుకోకపోవడం పై ఎమ్మెల్యే తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
ఎస్పీ కృష్ణారావు తీరుపై ఎమ్మెల్యేతో పాటు లాయర్లు కూడా అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే కార్యాలయంలో ఉన్నప్పటికీ ఎస్పీ క్యాంపు కార్యాలయానికి వెళ్లిపోవడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. దీనికి నిరసనగా ఎమ్మెల్యే అరవింద బాబు మధ్యాహ్నం ఒక గంట నుంచి ఎస్పీ కార్యాలయంలోనే బైఠాయించారు.
ఈ ఘటనపై రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆరా తీశారు. ఆయన ఆదేశాల మేరకు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జానీ సైదా, పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ హుటాహుటిన ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు.
ఎమ్మెల్యే అరవింద బాబుతో కలిసి ఎస్పీని కలిసేందుకు వారు కార్యాలయంలోనే వేచి ఉన్నారు. ఈ పరిణామాలతో ఎస్పీ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
