ఒక వైపు శాంతివచనాలు పలుకుతూనే అమెరికా సైన్యం ఇరాన్ పై పాశవిక దాడులు కొనసాగిస్తున్నది. ఆత్మరక్షణ పేరుతో అమెరికా సైన్యం దక్షిణ ఇరాన్లో దారుణమైన దాడులు చేసింది. క్షిపణి ప్రయోగ కేంద్రాలు, సముద్ర మైన్లు అమర్చుతున్న పడవలపై దాడులు నిర్వహించినట్లు అమెరికా ప్రకటించింది. అయితే ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్తో చర్చలు “సానుకూలంగా కొనసాగుతున్నాయి” అంటూ సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యానించడం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.
అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రతినిధి కెప్టెన్ టిమ్ హాకిన్స్ విడుదల చేసిన ప్రకటనలో, “ఇరాన్ దళాల నుంచి అమెరికా సైనికులకు ఉన్న ముప్పును దృష్టిలో ఉంచుకొని ఈ దాడులు చేపట్టాం. ప్రస్తుతం అమల్లో ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని గౌరవిస్తూ పరిమిత స్థాయిలోనే చర్యలు తీసుకున్నాం” అని పేర్కొన్నారు. అయితే ఇరాన్ నుంచి ఎలాంటి ముప్పు ఉన్నది, చర్చలపై దీని ప్రభావం ఏమిటి అన్న అంశాలపై పూర్తి వివరాలు వెల్లడించలేదు.
ఇదే సమయంలో ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఖాలిబాఫ్ను ఖతార్కు పంపి అమెరికాతో చర్చలు కొనసాగిస్తోంది. యుద్ధ సమయంలో ఇరాన్ దాడులను ఎదుర్కొన్న ఖతార్ వద్ద ఇరాన్కు చెందిన భారీ మొత్తంలో నిల్వ నిధులు ఉండటం కూడా ఈ చర్చల్లో కీలక అంశంగా మారింది.
ఇరాన్కు చెందిన వార్తా సంస్థలు అమెరికా దాడుల్లో నలుగురు రివల్యూషనరీ గార్డ్ సైనికులు మరణించినట్లు వెల్లడించాయి. మరోవైపు హోర్ముజ్ జలసంధికి సమీపంలోని బందర్ అబ్బాస్ ప్రాంతంలో భారీ పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ తెలిపింది. అక్కడ సైనిక నౌకాశ్రయం, విమానాశ్రయం ఉండటంతో ఉద్రిక్తత మరింత పెరిగింది.
ఇటీవల కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చినప్పటికీ పరిస్థితులు పూర్తిగా శాంతించలేదు. ప్రపంచ చమురు, సహజ వాయువు సరఫరాలో కీలకమైన హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ ప్రభావం కొనసాగుతుండటంతో అంతర్జాతీయ ఇంధన మార్కెట్లలో ఆందోళనలు నెలకొన్నాయి.
ఇదిలా ఉండగా, ఇరాన్తో కుదిరే ఏ ఒప్పందమైనా అబ్రహాం ఒప్పందాల్లో మరిన్ని దేశాలు చేరాలని ట్రంప్ షరతు విధించారు. ముఖ్యంగా సౌదీ అరేబియా, పాకిస్థాన్, ఖతార్ వంటి దేశాలు వెంటనే ఇజ్రాయెల్తో సంబంధాల పునరుద్ధరణకు అంగీకరించాలని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే బహ్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ ఒప్పందాల్లో చేరగా, ఈజిప్ట్, జోర్డాన్కు ఇజ్రాయెల్తో శాంతి ఒప్పందాలు ఉన్నాయి.
సౌదీ అరేబియా మాత్రం ఇజ్రాయెల్ గాజా సరిహద్దులకు వెళ్లి, తూర్పు జెరూసలేం రాజధానిగా పాలస్తీనా దేశాన్ని ఏర్పాటు చేయాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తోంది. గాజాలో హమాస్పై ఇజ్రాయెల్ చర్యలు గల్ఫ్ దేశాల్లో వ్యతిరేకతను పెంచాయి.
పాకిస్థాన్ మాజీ రాయబారి మసూద్ ఖాన్ మాట్లాడుతూ, అబ్రహాం ఒప్పందాల అంశం ఇప్పుడు చర్చల్లోకి రావడం కొత్త పరిణామమని, ఇది చర్చలను మరింత క్లిష్టం చేయవచ్చని అన్నారు. అయితే పాకిస్థాన్ తన పాత విధానానికే కట్టుబడి ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
ట్రంప్ మాత్రం భవిష్యత్తులో ఇరాన్ కూడా అబ్రహాం ఒప్పందాల్లో చేరే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చారు. ఆయన తొలి అధ్యక్ష పదవీకాలంలో అమెరికా మధ్యవర్తిత్వంతో ప్రారంభమైన ఈ ఒప్పందాల్లో తరువాత సూడాన్, మొరాకో, కజకిస్థాన్ వంటి దేశాలు కూడా చేరాయి.
