విశాఖపట్నం జిల్లాలో 20 నెలల పాటు పని చేశానని.. ఈ కాలంలో జిల్లాతో, జిల్లా ప్రజలతో విడదీయరాని బంధం ఏర్పడిందని జిల్లా కలెక్టర్ గా పని చేసి బదిలీపై వెళ్ళిపోతున్న ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు. “మీ అందరి మద్దతుతో ఇన్ని కార్యక్రమాలు విజయవంతంగా చేశాను.
భయపెట్టి పని చేయించటం నా నైజం కాదు. సహకారంతో, మద్దతుతో చేయించటమే నాకు తెలుసు. నాతో చిన్న మాట కూడా అనిపించుకుండా అందరూ మంచి పనితీరు కనబరిచారు. స్ఫూర్తి కొనసాగించారు. ఆర్డీవోలు, డిప్యూటీ కలెక్టర్లు మంచి సహకారం అందించారు.
యోగాంధ్రలో అధికారుల సహకారం మరువలేనిది. అందరి సహకారంతో ఎన్నో రకాల మంచి పనులు చేపట్టగలిగామని” చెప్పారు. పరిపాలనాపరమైన ఎన్నో అంశాల్లో అధికారులు, సిబ్బంది సహకరించారని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ, ఇతర కార్యక్రమాల నిర్వహణలో సమష్టి కృషితో ముందుకు సాగామని గుర్తు చేసుకున్నారు.
మంచి మనసుతో ప్రయత్నిస్తే దేవుడు సహకరిస్తాడు
మంచి మనస్సుతో ప్రయత్నిస్తే దేవుడు కూడా సహకరిస్తాడని నమ్ముతున్నా అని అన్నారు. వసతి గృహాల నిర్వహణలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపించారని కలెక్టర్ ప్రశంసించారు. రెవెన్యూపరమైన అంశాల్లో ఎలాంటి ప్రతికూలతలు రాకుండా పని చేశామన్నారు.
చాలా కంపెనీలకు భూ కేటాయింపులు చేయగలిగామన్నారు. నా సీనియర్స్ నుంచి నేను చాలా నేర్చుకున్నా.. అవే ఇక్కడ అమలు చేశాను అని చెప్పారు. విశాఖ రూపురేఖలను మార్చేందుకు కేతన్ గార్గ్, తేజ్ భరత్ లాంటి యువ అధికారుల అవసరం ఎంతైనా ఉందన్నారు. మాస్టర్ ప్లాన్ రోడ్లు కూడా వేగంగా చేస్తున్న తేజ్ కు అభినందనలు, రానున్న ఐదు సంవత్సరాల్లో విశాఖకు మంచి భవిష్యత్తు ఉందని జోస్యం చెప్పారు.
విశాఖపట్నం జిల్లా ప్రశాంతతకు మారుపేరు అని, ఇక్కడి ప్రజలు కూడా సౌమ్యులని అన్నారు. ఇప్పటి వరకు చాలా చోట్ల పని చేశానని అన్నిటి కంటే విశాఖ జిల్లా ప్రత్యేకంగా నిలుస్తుందని అన్నారు. తన పరిపాలనా కాలంలో అన్ని విధాలుగా సహకరించిన ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, అధికారులకు, పేషీ సిబ్బందికి పేరుపేరునా ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ కంటతడి పెట్టారు.
మాలాంటి ఎందరికో ఆదర్శంగా.. స్పూర్తిగా నిలిచారు
ఒక వైపు సేవా దృక్పథం కనబరుస్తూ.. మరో వైపు పరిపాలనా దక్షత చూపుతూ అందరి మన్ననలు అందుకున్న కలెక్టర్ గా హరేంధిర ప్రసాద్ నిలిచిపోతారని జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, జీవీఎంసీ, వీఎంఆర్డీఏ కమిషనర్లు కేతన్ గార్గ్, తేజ్ భరత్ లు పేర్కొన్నారు. ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నామని గుర్తు చేశారు. న్యూ డివిజన్స్, కోర్టు కేసుల గురించి స్పష్టంగా వివరించారని జేసీ చెప్పారు.
మానవతా విలువలను పాటిస్తూ.. పరిపాలనా దక్షత ప్రదర్శించారని కొనియాడారు. భవిష్యత్తులో మరొక సారి తనతో కలిసి పని చేసే అవకాశం రావాలని కోరుకుంటున్నానని జేసీ అన్నారు. వీఎంఆర్డీఏ కమిషనర్ మాట్లాడుతూ “హరేంధిర ప్రసాద్ నాకు 2017 నుంచి బాగా తెలుసు. ఆయన ఎలాంటి విషయంలోనైనా చాలా సానుకూలంగా స్పందిస్తారు.
ఎన్నికల సమయంలో అదనపు సీఈవోగా ఆయన పనితీరు మరింత అధ్బుతం. నాకు ఎంతో సహకరించారు. అభిమానంతో, ప్రేమతో పని చేయించే నైపుణ్యం ఉన్న వ్యక్తి జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్. రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా బాగా నమ్మి యోగాంధ్ర లాంటి కార్యక్రమాన్ని అప్పగించారు. విశాఖ నుంచి వెళ్ళిపోవటం కొంచెం బాధాకరమే అయినా.. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నా” అని పేర్కొన్నారు.
ఎలాంటి ఛాలెంజ్ ని అయినా సులభంగా ఎదుర్కోవటం అనేది ఆయన్ని చూసి తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. మాలాంటి ఎందరికో ఆయన ఆదర్శంగా నిలిచారని ఆన్నారు. జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ మాట్లాడుతూ “ఆయన్ని నేను ఫస్ట్ టైమ్ కె.ఆర్.పురంలో కలిశాను.
ఆయన ఆతిథ్యం ఎన్నటికీ మరువలేను. చాలా షాఫ్ట్ గోయింగ్ పర్సన్. క్రికెట్ చాలా బాగా ఆడతారు. అలాగే మంచి పరిపాలన కూడా చేస్తారు. నాయకుడు సరిగ్గా ఉంటే మిగతా వాళ్ళంతా బాగా ఉంటారు. మంచి ఆలోచన, మంచి విజన్ ఉన్న వ్యక్తి హరేంధిర ప్రసాద్” అని కొనియాడారు.
ఎంత ఒత్తిడి ఉన్నా సహనం కోల్పోకుండా తనదైన పనితీరును ప్రదర్శించారని, చాలా గణాంకాలను గుక్క తిప్పుకోకుండా చెప్పేవారని, విశాఖపట్నంలో అణువణుపై ఆయన పట్టు సాధించారని ప్రశంసించారు. కలెక్టర్ అనే పోస్ట్ కు నిజమైన అర్హత కలిగిన వ్యక్తి అని కమిషనర్ కొనియాడారు.
