వైసీపీలో ఒకప్పుడు నెంబర్-2గా చక్రం తిప్పిన మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, ఇప్పుడు సొంతంగా డిజిటల్ మీడియా సామ్రాజ్యాన్ని స్థాపించేందుకు రెడీ అయ్యారు. సుమారు రూ. 500 కోట్ల భారీ బడ్జెట్తో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో న్యూస్ ప్లాట్ఫామ్ను ప్రారంభించబోతున్నట్లు ఆయన చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. నిష్పక్షపాతంగా ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తామని విజయసాయి ప్రకటించడం విశేషం.
జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా, పార్టీ వ్యవహారాలన్నీ చూసుకునే ట్రబుల్ షూటర్గా విజయసాయి రెడ్డికి పేరుండేది. అయితే, 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత సమీకరణాలు వేగంగా మారిపోయాయి. జగన్తో విభేదాలు రావడం, ఆ తర్వాత ఆయన వైసీపీకి రాజీనామా చేయడం చకచకా జరిగిపోయాయి. కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా, సైలెంట్గా ఉన్న సాయిరెడ్డి.. ఇప్పుడు నేరుగా మీడియా రంగంలోకి అడుగుపెట్టడం ద్వారా తన పాత మిత్రుడికి సవాల్ విసురుతున్నారనే చర్చ మొదలైంది.
జగన్ బలంగా నమ్ముకున్న సాక్షి మీడియాకు పోటీగా విజయసాయి రెడ్డి ఈ కొత్త ప్లాట్ఫామ్ను తీసుకువస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. డిజిటల్ మీడియా విజయవంతం అయిన తర్వాత, పూర్తిస్థాయి శాటిలైట్ న్యూస్ ఛానల్ను కూడా ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ఏ రాజకీయ పార్టీకి కొమ్ముకాయకుండా, స్వతంత్రంగా వ్యవహరిస్తామని చెప్పడం ద్వారా.. అటు వైసీపీకి, ఇటు కూటమి ప్రభుత్వానికి తటస్థంగా ఉంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ఆయన చూస్తున్నారు.
సామాన్యులు, రైతులు, యువత, మహిళల గొంతుకగా ఈ వేదిక నిలుస్తుందని సాయిరెడ్డి పేర్కొన్నారు. అయితే, 500 కోట్ల భారీ పెట్టుబడితో రాబోతున్న ఈ సంస్థ వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటనేది ఆసక్తికరంగా మారింది. గతంలో జగన్ ఆర్థిక వ్యవహారాలన్నీ చూసిన సాయిరెడ్డికి, మీడియా నిర్వహణలో ఉన్న మెళకువలు బాగా తెలుసు. అందుకే, సాక్షి స్థాయిలో లేదా అంతకంటే శక్తివంతంగా ఈ కొత్త ఛానల్ను తీర్చిదిద్దే అవకాశం ఉందని భావిస్తున్నారు.
మొత్తానికి, పాలిటిక్స్ నుంచి మీడియా రంగం వైపు విజయసాయి రెడ్డి వేస్తున్న ఈ అడుగు ఏపీలో కొత్త చర్చకు దారితీసింది. త్వరలోనే ఈ సంస్థ పేరును ప్రకటిస్తానని ఆయన చెప్పడంతో, మీడియా రంగంలోకి రాబోతున్న ఆ కొత్త ‘బ్రాండ్’ ఏంటనేది ఇప్పుడు అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది. జగన్కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న వ్యక్తి, ఇప్పుడు ఆయనకు పోటీగా మీడియా సంస్థను పెట్టడం ఏపీ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తెస్తుందో వేచి చూడాలి.
