తనను తాను ఏసుక్రీస్తుతో పోల్చుకుంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విడుదల చేసుకున్న ఏఐ చిత్రం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. అమెరికా అధ్యక్షుడు తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ “ట్రూత్ సోషియల్”లో తాను ఏసుక్రీస్తు రూపంలో కనిపించేలా రూపొందించిన ఏఐ చిత్రాన్ని షేర్ చేయడంతో పెద్ద చర్చ మొదలైంది.
ఈ చిత్రంలో ట్రంప్ను క్రైస్ట్లాంటి భంగిమలో, ప్రకాశవంతమైన వెలుగులతో, సంప్రదాయ క్రైస్తవ కళా ప్రతీకలతో చూపించారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతూ, మిశ్రమ స్పందనలు రాబట్టింది. కొందరు దీనిని సరదాగా తీసుకుంటే, మరికొందరు తీవ్రంగా విమర్శించారు.
ముఖ్యంగా క్రైస్తవ మత సంస్థలు, మతపరమైన విశ్లేషకులు ఈ చిత్రాన్ని అనుచితంగా, మత భావాలను దెబ్బతీసేదిగా అభివర్ణించారు. పవిత్రమైన ప్రతీకలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించడం నైతికంగా సరికాదని వారు అభిప్రాయపడ్డారు. అయితే ట్రంప్ అనుచరులు మాత్రం దీనిని సరదా, డిజిటల్ వ్యంగ్యంగా భావిస్తూ విమర్శలను కొట్టిపారేశారు. ఆధునిక రాజకీయాల్లో ఏఐ ఆధారిత చిత్రాలు, ప్రతీకాత్మక ప్రదర్శనలు పెరుగుతున్న నేపథ్యంలో ఇది కూడా అలాంటి ప్రయత్నమేనని వారు పేర్కొన్నారు.
ఇదే సమయంలో పోప్ లియో XIVపై ట్రంప్ చేసిన విమర్శలు కూడా వివాదాన్ని మరింత పెంచాయి. పోప్ తన విధులను సరిగా నిర్వహించడం లేదని, అతను లిబరల్ విధానాలకు మద్దతు ఇస్తున్నారని ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ యుద్ధంపై పోప్ చేసిన శాంతి పిలుపులపై స్పందిస్తూ, అమెరికా చర్యలను విమర్శించడం తగదని ట్రంప్ అభిప్రాయపడ్డారు. అయితే పోప్ లియో XIV స్పందిస్తూ, తన సందేశం గాస్పెల్ విలువలపై ఆధారపడి ఉందని, శాంతి మరియు సామరస్యమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
