కల్తీ నెయ్యి సరఫరా కేసులో దొంగలు ఎవరంటే TTD మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి భుజాలు తడుముకుంటున్నారు. విచారణకు హాజరు కావాలని సిట్ నుంచి పిలుపు రాగానే తనకు అనారోగ్యం వచ్చిందని చెబుతున్నారు. ఈ నెల 20న విచారణ కోసం తిరుపతి. రావాలని సుబ్బారెడ్డిని పిలిచింది సిట్.
నోటీసులు కూడా జారీ చేశారు. అయితే, తన ఆరోగ్యం సహకరించనందున తాను తిరుపతికి రాలేనని సుబ్బారెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో 20న సిట్ అధికారులు హైదరాబాద్ వెళ్లి అక్కడే ఆయనను విచారించనున్నట్టు సమాచారం. కల్తీ నెయ్యి వ్యవహారంలో అన్ని వేళ్లు ఇప్పుడు సుబ్బారెడ్డి వైపే చూపిస్తున్నాయి.
ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్న బోలేబాబా డెయిరీ సంస్థ వెనుక సుబ్బారెడ్డి ఉన్నారని, పెద్ద ఎత్తున ఆయన వెనకేసుకున్నారని ఇప్పటికే సిట్ అధికారులు ఆధారాలు గుర్తించారు. సుబ్బారెడ్డి మాజీ పీఏ అప్పన్న దొరికిపోవడం.. ఆయన ఆర్థిక లావాదేవీలన్నీ ఆరా తీయడంతో సుబ్బారెడ్డి ఇరుక్కుపోయినట్లు తెలుస్తోంది.
ఇక, ఇటీవల విచారణకు హాజరైన ధర్మారెడ్డి సైతం అంతా హైకమాండేనని వాంగ్మూలం ఇచ్చారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో తన పాత్ర ఉందన్న ఆధారాలు బయటపడుతుండడంతో సుబ్బారెడ్డి కంగారు పడిపోతున్నారు. దీంతో కోర్టులను ఆశ్రయించి విచారణకు డుమ్మా కొట్టే ప్రయత్నం చేస్తున్నారు.
కానీ ప్రస్తుతం విచారణ చేస్తోంది సుప్రీంకోర్టు నియమించిన సిట్. గడిచిన ఐదేళ్లలో దాదాపు 250 కోట్ల విలువైన కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని సిట్ నిర్ధారించింది. చుక్క పాలు వాడకుండా పామాయిల్కు రసాయానాలు కలిపి నెయ్యి అని సరఫరా చేశారని తేల్చింది. దీని వెనుక గత ప్రభుత్వంలోని పెద్దలు ఉన్నారని, ఈ స్కామ్ చాలా లోతుగా ఉందని స్పష్టం చేసింది సిట్.
