తమిళనాడులోని ఓ ప్రైవేటు బాణాసంచా కర్మాగారంలో ఘోర ప్రమాదం సంభవించింది. విరుద్ నగర్ సమీపంలోని కట్టనార్పట్టిలో ఉన్న ఓ బాణసంచా తయారీ పరిశ్రమలో ఆదివారం మధ్యాహ్న సమయంలో ఫ్యాక్టరీలో భారీ పేలుడు జరగడంతో 18 మంది మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.
బాణాసంచా పేలుడు ధాటికి కలిగిన ప్రకంపనలు 10 కి.మీ దారం వరకు విస్తరించాయని స్థానికులు చెబుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ప్రస్తుతం సహాయక చర్యలు చేపట్టారు. పేలుడు ధాటికి బాణాసంచా తయారీ పరిశ్రమ పూర్తిగా ధ్వంసమైంది. పేలుడు తీవ్రతకు పరిసరాలు కంపించిపోయాయి. సమీప ప్రజలు భయాందోళనతో పరుగులు తీశారు. ప్రమాద సమయంలో పరిశ్రమలో 30 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు సమాచారం.
ఈ విషాధ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై ఆరా తీశారు. వెంటనే ఘటనాస్థలికి వెళ్లాలని మంత్రులను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయాన్ని అందించాలని సూచించారు. మరోవైపు ఈ పేలుడు ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఈ ప్రమాదంలో భారీ ప్రాణనష్టం సంభవించడం తమను ఎంతో కలచివేసిందని తెలిపారు. ఈ కష్టకాలంలో బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
