యువత స్వచ్ఛందంగా రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక పిలుపునిచ్చారు. గురు పౌర్ణిమ సందర్భంగా నారాయణపేట జిల్లా కేంద్రంలోని షిరిడి సాయిబాబా మందిర ఆవరణలో స్నేహ మిత్ర మండలి ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రక్తదానం చేయడం ద్వారా అవసరమైన వారికి సకాలంలో రక్తం అందించడంతో పాటు, రక్తదాత ఆరోగ్యానికి కూడా ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. ప్రతి సంవత్సరం ఈ తరహా రక్తదాన శిబిరాలను నిర్వహిస్తూ సామాజిక సేవలో భాగస్వాములవుతున్న స్నేహ మిత్ర మండలి నిర్వాహకులను ఆమె అభినందించారు.
అనంతరం జిల్లా పోలీసు సూపరింటెండెంట్ డాక్టర్ వినీత్ శిబిరాన్ని సందర్శించి మాట్లాడారు. యువత స్వచ్ఛందంగా రక్తదానం చేయడం ద్వారా సమాజానికి సేవ చేయడంతో పాటు ఆరోగ్యపరమైన ప్రయోజనాలు కూడా పొందవచ్చని పేర్కొన్నారు. రక్తదాతలను, శిబిర నిర్వాహకులను ఈ సందర్భంగా అభినందించారు.
ఈ రక్తదాన శిబిరాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ మంజుల రెడ్డి, ఆర్డీఓ రమేష్ సందర్శించారు.
