హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వడగండ్ల వర్షం కురిసింది. కుత్బుల్లాపూర్ పరిసరాల్లో భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. సికింద్రాబాద్ బోయిన్ పల్లి పరిసర ప్రాంతాలలో వడగళ్ల వర్షం కురిసింది. బోయిన్ పల్లి, తిరుమలగిరి, అల్వాల్, ప్యాట్నీ, పారడైజ్, మారేడుపల్లి తదితర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని వివిధ ప్రాంతాల్లో వడగండ్ల వాన కురుస్తోంది.
కూకట్ పల్లి తదితర ప్రాంతాల్లో వడగళ్ల వాన పడింది. కూకట్పల్లి, మూసాపేట్, జేఎన్టీయూ , నిజాంపేట్, కేపీహెచ్బీకాలనీ, ప్రగతి నగర్ బాచుపల్లి తదితర ప్రాంతాల్లో సాయంత్రం అకస్మాత్తుగా వడగళ్ల వాన కురిసింది. వేడి వాతావరణం కొనసాగుతున్న సమయంలో ఒక్కసారిగా గాలివానతో పాటు వడగళ్ల వర్షం పడటంతో ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు.
ఈ వర్షం కారణంగా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉరుములు, గాలులతో కూడిన వర్షాలు, వడగళ్ల వానలు సంభవిస్తున్నాయని, వచ్చే కొన్ని గంటలు కూడా ఇలాంటి పరిస్థితులు కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అవసరం లేకుండా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
నేలకొరిగిన భారీ వృక్షం
చింతల్, పద్మనగర్లో గాలి వాన ధాటికి వేర్లతో సహా భారీ వృక్షం కూలింది. చెట్టు ధాటికి రెండు కరెంట్ స్తంభాలు నేలకొరిగాయి. పలు ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. దీంతో రహదారులపైకి వాన నీరు చేరి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఔటర్ రింగ్ రోడ్ పరిసరాల్లోనూ భారీవర్షమే పడింది. కొన్నాళ్లుగా భానుడి భగభగలతో అల్లాడిపోతున్న నగరవాసులకు ఈ వర్షం ఉపశమనం కలిగించింది. ఉక్కపోతతో నగర ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వాతావరణం చల్లబడి ఏకధాటిగా వర్షం కురవడంతో ప్రజలు స్వాంతన పొందారు.
