ప్రత్యేకంహోమ్

ఢిల్లీ అల్లర్ల నిందితులకు సుప్రీం కోర్టు బెయిల్

#UmarKhaleed

ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసులో నిందితులకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. నిందితులైన ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్‌లకు గతంలో సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసన బెయిల్ నిరాకరించింది. ఇలా బెయిల్ నిరాకరించిన అంశంపై మరో ద్విసభ్య ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఐదేళ్లకు పైగా నిర్బంధంలో ఉన్న నార్కో ఉగ్రవాద కేసు నిందితుడు సయ్యద్ ఇఫ్తిఖార్ అండ్రాబీకి బెయిల్ మంజూరు చేస్తూ త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును బెయిల్ తిరస్కరించిన ద్విసభ్య ధర్మానం విస్మరించిందని తాజాగా ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది. ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఇచ్చిన తీర్పును ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం విస్మరించలేదని స్పష్టం చేసింది.

ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్‌ల బెయిల్ అభ్యర్థనలను జనవరి 5న తిరస్కరించిన న్యాయమూర్తులు అరవింద్ కుమార్, ఎన్వీ అంజారియా ధర్మాసనం, వారి పాత్ర కేవలం స్థానిక ఘటనలకే పరిమితం కాలేదని, ప్రణాళిక, సమీకరణ, వ్యూహాత్మక దిశానిర్దేశ స్థాయిలో ఉందని వ్యాఖ్యానించింది. అందువల్ల చట్టంలోని కఠిన నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది.

అయితే సోమవారం ఇచ్చిన తాజా తీర్పులో న్యాయమూర్తులు బీవీ నాగరత్న, ఉజ్జల్ భుయాన్‌ల ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్ స్పష్టం చేస్తూ, పెద్ద ధర్మాసనం ఇచ్చిన తీర్పును చిన్న ధర్మాసనం తప్పనిసరిగా అనుసరించాల్సిందేనన్నారు. సందేహం ఉంటే మరింత పెద్ద ధర్మాసనానికి పంపాలని, కానీ ఇప్పటికే ఉన్న చట్టపరమైన సూత్రాన్ని బలహీనపరచడం లేదా పక్కనపెట్టడం సరికాదన్నారు.

ప్రత్యేకంగా 2021లో ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఇచ్చిన కేఏ నజీబ్ తీర్పును ఆయన ప్రస్తావించారు. దీర్ఘకాల నిర్బంధం కొనసాగుతున్న సందర్భాల్లో రాజ్యాంగ హక్కుల పరిరక్షణ దృష్ట్యా కఠిన చట్టాల కింద ఉన్న నిందితులకు కూడా బెయిల్ ఇవ్వవచ్చని ఆ తీర్పు స్పష్టం చేసిందన్నారు. రాజ్యాంగంలోని వ్యక్తిగత స్వేచ్ఛ హక్కులను కాపాడాల్సిన బాధ్యత న్యాయస్థానాలపై ఉందని తెలిపారు.

చట్టంలోని కఠిన నిబంధనలు ఉన్నప్పటికీ బెయిల్ మినహాయింపు కాకుండా సాధారణ సూత్రమేనని, జైలు మాత్రం మినహాయింపుగా ఉండాలని ధర్మాసనం పేర్కొంది. అయితే ప్రతి కేసు పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని కూడా స్పష్టం చేసింది.

ఉగ్రవాద నిరోధక చట్టంలోని 43డి(5) నిబంధన ప్రకారం, తీవ్ర నేరాల కేసుల్లో నిందితులకు బెయిల్ మంజూరు చేసే ముందు ప్రభుత్వ న్యాయవాదికి వాదనలు వినిపించే అవకాశం ఇవ్వాలి. అలాగే కేసు వివరాలు పరిశీలించిన తరువాత ఆరోపణలు ప్రాథమికంగా నిజమని కోర్టుకు అనిపిస్తే బెయిల్ ఇవ్వకూడదని చట్టం చెబుతోంది.

అయితే న్యాయమూర్తి భుయాన్ వ్యాఖ్యానిస్తూ, గల్ఫిషా ఫాతిమా కేసులో ఇచ్చిన తీర్పు కేఏ నజీబ్ తీర్పును చాలా పరిమితంగా అర్థం చేసుకుందని అన్నారు. కేవలం అత్యంత అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే ఆ తీర్పు వర్తిస్తుందనే భావన సరైంది కాదన్నారు. సమయం గడుస్తుండటం, విచారణ ఆలస్యం కావడం వంటి పరిస్థితులు కూడా పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేశారు.

కేఏ నజీబ్ తీర్పు దేశంలోని అన్ని దిగువ కోర్టులకు, హైకోర్టులకు, అలాగే తక్కువ సభ్యుల ధర్మాసనాలకు కూడా బద్ధమైన చట్టమని ధర్మాసనం స్పష్టం చేసింది. దాన్ని బలహీనపరచడం లేదా పక్కనపెట్టడం న్యాయశాస్త్రానికి విరుద్ధమని పేర్కొంది.

జమ్మూకాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాకు చెందిన అండ్రాబీని జాతీయ దర్యాప్తు సంస్థ 2020 జూన్ 11న అరెస్టు చేసింది. సరిహద్దు ప్రాంతం నుంచి మాదకద్రవ్యాలను సేకరించి వాటి ద్వారా వచ్చిన డబ్బును ఉగ్రవాద సంస్థలకు పంపించాడని ఆరోపణలు ఉన్నాయి. అతనిపై మాదకద్రవ్యాల నియంత్రణ చట్టం, ఉగ్రవాద నిరోధక చట్టం, క్రిమినల్ కుట్ర నిబంధనల కింద కేసులు నమోదు అయ్యాయి. గతంలో ప్రత్యేక దర్యాప్తు కోర్టు, అనంతరం జమ్మూకాశ్మీర్ మరియు లడఖ్ హైకోర్టు బెయిల్ నిరాకరించడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Related posts

గణేష్ ఉత్సవాల సందర్భంగా ఏం చేయాలి?

Satyam News

ఘనంగా కవిత జన్మదిన వేడుకలు

Satyam News

కొత్త సినిమాలతో మళ్లీ కలకలం రేపుతున్న ఐబొమ్మ

Satyam News

అమరావతిలో ఆస్ట్రో ఫిజిక్స్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం

Satyam News

ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ కొరత లేదు

Satyam News

మాట నిలబెట్టుకున్న లోకేష్…. పేద ముస్లిం ఫ్యామిలీకి రంజాన్‌ కానుక…!!

Satyam News

Leave a Comment