రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత, బాధ్యత మరియు వినియోగదార్ల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (ఎపీ రెరా) నిబద్ధతతో పనిచేస్తుందని ఎపీ రెరా ఛైర్ పర్సన్ ఆరే శివారెడ్డి తెలిపారు. సోమవారం రాయపూడిలోని సిఆర్డిఏ కార్యాలయం ఎదుట నాలుగవ బ్లాకులో ఎపి రెరా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎపీ రెరా ఛైర్ పర్సన్ ఆరే శివారెడ్డి మాట్లాడుతూ ప్రతి రియల్ ఎస్టేట్ ఏజెంట్, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో స్థలాలు, అపార్ట్మెంట్లు లేదా భవనాల అమ్మకం, కొనుగోలు లేదా మార్కెటింగ్ వ్యాపారంలో పాల్గొనడానికి ముందు తప్పనిసరిగా ఏపీ రెరా అధికారిక వెబ్ సైట్ www.rera.ap.gov.in ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలన్నారు.
ప్రాజెక్టుల నమోదు కోసం సూచించిన పత్రాలను వివరాలను అందించిన వెంటనే నిర్దేశిక కాల పరిమితిలో అనుమతి మంజూరు చేయడం జరుగుతుందన్నారు. రియల్ ఎస్టేట్ ( నియంత్రణ మరియు అభివృద్ధి) చట్టం ద్వారా ఇంటి కొనుగోలుదారులకు సురక్షితమైన, నమ్మకమైన మరియు పారదర్శకమైన స్థిరాస్తి లావాదేవీలు అందించబడతాయన్నారు. రాష్ట్రంలోని రియల్ ఎస్టేట్ రంగంలోని వ్యాపారులకు, లేఅవుట్లో స్థలాలు, అపార్ట్మెంట్లో ప్లాట్లు కొనుగోలుదారులకు రెరా అధారిటీ, అధికారులు స్నేహపూర్వక వాతావరణం లో అవసరమైన సహకారం అందిస్తుందన్నారు.
మోసపూరిత వాగ్దానాలపై కఠిన చర్యలు
స్థిరాస్తి వ్యాపారుల మోసపూరితమైన వాగ్దానాలపైన వినియోగదారులు రెరా కు ఫిర్యాదు చేస్తే విచారించి సత్వరమే పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. రియల్ ఎస్టేట్ ( నియంత్రణ మరియు అభివృద్ధి) చట్టం పై రియల్ ఎస్టేట్ రంగంలోని స్టేక్ హోల్డర్స్ కు విస్తృత స్థాయిలో అవగాహన కోసం ఏపీ రెరా ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన ప్రతినెల ఒక జిల్లాలో 2025 డిసెంబర్ పది నుంచి 13 జిల్లాలలో 2026 డిసెంబర్ వరకు నిర్వహించనున్నామని వివరించారు.
ఈ అవగాహన కార్యక్రమ తిరుపతి జిల్లా నుంచి ప్రారంభిస్తున్నామన్నారు. స్థిరాస్తి రంగంలోని వ్యాపారులు వారి వినియోగదారులతో స్నేహపూర్వకంగా వ్యాపార లావాదేవీలు నిర్వహించాలని, సాధ్యం కాని హామీలను ఇచ్చి మోసపూరితంగా వ్యవహరించరాదని సూచించారు. నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ నిర్దేశించిన కాల పరిమితి లోపే నిర్మాణాలను వినియోగదారులకు అందించాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం స్థిరాస్తి వ్యాపారుల ప్రయోజనాల కోసం బిల్డింగ్ రూల్స్ లోను, లేఅవుట్లు ఏర్పాట్లు లోను అనేక నిబంధనలను సరళతరం చేస్తూ సమూల మార్పులు తీసుకువచ్చిందన్నారు. వినియోగదారులను మోసగించే స్థిరాస్తి వ్యాపార సంస్థలపై ఏపీ రెరా చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ప్రజల జీవితకలల సౌధాన్ని పూర్తిస్థాయి నాణ్యత ప్రమాణాలతో నిర్మించి అందించాలన్న ప్రభుత్వం లక్ష్యాలకు అనుగుణంగా రెరా అధారిటీ చిత్తశుద్ధితో కృషి చేస్తుందని. ఇటువంటి బాధ్యతను అప్పగించిన ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నామని చెప్పారు.
రికార్డు స్థాయిలో దరఖాస్తుల పరిశీలన
ఏపీ రెరా డైరెక్టర్ కె నాగ సుందరి మాట్లాడుతూ రాష్ట్రంలో జనవరి 2025 నుంచి ఇప్పటివరకు ప్రాజెక్టు నమోదు కోసం 1011 దరఖాస్తులు అందగా వాటిలో 731 కి అనుమతులు మంజూరు చేశామని, మిగతావి అవసరమైన పత్రాలు కోసం సమాచారం అందించడం జరిగిదన్నారు. ఏపీ రెరా నూతన పాలకవర్గం ఏర్పడిన గత రెండు నెలల్లో 214 ప్రాజెక్టులు, 27 మార్కెటింగ్ ఏజెన్సీల ఎజెంట్స్ రిజిస్టర్ జరిగిందని తెలిపారు.
రాష్ట్రంలో 500 చదరపు మీటర్లు , 8 యూనిట్స్ కి మించి ఉన్న అపార్ట్మెంట్స్ మరియు అన్ని లేఅవుట్ ప్రాజెక్టు లు నూరు శాతం రెరా లో కచ్చితంగా నమోదు చేసుకోవాలన్నారు. నిర్దేశిత మార్గదర్శకాలు ప్రకారం అవసరమైన పత్రాలు వివరాలు అందించి దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి చేసిన ప్రాజెక్టులు క్లోజర్ కు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇప్పటికే 115 ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేయటం జరిగిందన్నారు.
ప్రాజెక్టుల పురోగతి ప్రతి మూడు నెలలకు ఒకసారి సమర్పిచాలన్నారు. ఇప్పటివరకు రెరాలో నమోదు కాని ప్రాజెక్టులకు, దరఖాస్తులు షార్ట్ ఫాల్స్ ఉన్న వారికి, నిర్దేశిత కాల పరిమితిలో పూర్తి చేయని ప్రాజెక్టులకు నోటీసులు జారీ చేయడం జరుగుతుందన్నారు. స్థిరాస్తి వ్యాపారులపై వినియోగదారులు ఇచ్చిన ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించడం జరుగుతుందని, వారానికి రెండుసార్లు గురువారం, శుక్రవారం బెంచి నిర్వహించి సమస్యల పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఇప్పటికీ 285 ఫిర్యాదులపై ఆర్డర్స్ జారీ చేయడం జరిగిందన్నారు. రెరాలో ప్రాజెక్టుల నమోదుకు, ఫిర్యాదులు అందించేందుకు అవసరమైన సహకారం కోసం ప్రత్యేకంగా రేరా కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని చెప్పారు. సమావేశంలో ఏపీ రెరా సభ్యులు ఏ. జగన్నాధ రావు, ఎం. వెంకటరత్నం, డి. శ్రీనివాసరావు, యు.ఎస్.ఎల్.ఎన్ కామేశ్వరరావు, జె కులదీప్ పాల్గొన్నారు.
