పరవాడ ఇండస్ట్రియల్ పార్క్లోని దక్షిణ్ ఎనర్జీ కెమికల్ కంపెనీలో జరిగిన అగ్నిప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు కార్మికుల కుటుంబాలకు అన్ని విధాలా న్యాయం చేస్తామని పెందుర్తి ఎమ్మెల్యే, జనసేన ఉమ్మడి విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు హామీ ఇచ్చారు.
ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబ సభ్యులను పరవాడ ఫార్మాసిటీ, కేజీహెచ్లో పరామర్శించిన ఎమ్మెల్యే, అధికారులు, కంపెనీ ప్రతినిధులు, కార్మిక సంఘాల నాయకులతో సమావేశమై ఘటన వివరాలు తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వంతో పాటు కంపెనీ యాజమాన్యం నుంచి కూడా తగిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ఫార్మాసిటీలో తరచూ ప్రమాదాలు జరగడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ప్రమాదానికి గల కారణాలపై జిల్లా కలెక్టర్, పోలీసు అధికారులు సమగ్ర దర్యాప్తు చేపడుతున్నారని, యాజమాన్యం నిర్లక్ష్యం తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ ప్రమాదంలో గోవాడ గ్రామానికి చెందిన వేపాడ వెంకటేష్ (34), జగ్గన్నపేటకు చెందిన బోడెపు త్రినాథ్ (24) మృతి చెందారని తెలిపారు. వెంకటేష్కు ముగ్గురు కుమార్తెలు ఉండగా, త్రినాథ్ కుటుంబం కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయిందన్నారు. మృతులను తిరిగి తీసుకురాలేకపోయినా, వారి కుటుంబాలకు తగిన ఆర్థిక సహాయం అందించి ఆదుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
పరిశ్రమల్లో కార్మికుల భద్రతకు కంపెనీలు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, భద్రతా నిబంధనలను నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని పంచకర్ల రమేష్ బాబు స్పష్టం చేశారు.
