శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం రాయల–బంకి గ్రామాలను కలుపుతూ మంజూరైన బీటీ రోడ్డు పనులు మధ్యలో నిలిచిపోవడంతో మాజీ ఎమ్మెల్యే కలమత్త వేంకటరమణ పనుల ప్రాంతాన్ని పరిశీలించారు. మార్చి నెలలో రాయల చెరువు గట్టుపై ట్రెంచ్ త్రవ్వి పనులు నిలిపివేయడంతో ప్రజా రవాణాకు తీవ్ర అంతరాయం కలుగుతోందని ఆయన తెలిపారు.
చెరువు అంతర్భాగంలో ట్రెంచ్ త్రవ్వడం వల్ల గట్టు బలహీనపడిందని, భారీ వర్షాలు కురిస్తే గండి పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో రాయల, మాకవరం, కుద్దిగం, పొన్నుటూరు గ్రామాల పరిధిలోని వందల ఎకరాల పంటలు నష్టపోయే అవకాశం ఉందన్నారు.
పనులు పూర్తి చేయకుండానే బిల్లులు చెల్లించేందుకు ప్రయత్నాలు జరిగాయన్న ఆరోపణలపై జిల్లా కలెక్టర్ సమగ్ర విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే చెరువులో త్రవ్విన ట్రెంచ్ను వెంటనే పూడ్చివేసి, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
