భారత రాష్ట్ర సమితి కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్.. వికారాబాద్ జిల్లా పర్యటనలో ఆసక్తికరమైన సన్నివేశం కనిపించింది. కేటీఆర్ రాకతో స్థానిక బీఆర్ఎస్ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ కేసీఆర్తో వైఎస్ రాజశేఖరరెడ్డి, కేటీఆర్తో జగన్.. ఫోటోలతో ఉన్న ఫ్లెక్సీలను ప్రదర్శించారు. రాష్ట్ర విభజనకు ముందు టీఆర్ఎస్, వైసీపీ మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనే పరిస్థితి ఉండేది. తెలంగాణలో ఓదార్పు యాత్రకు వచ్చిన జగన్ని టీఆర్ఎస్ శ్రేణులు తరిమి తరిమి కొట్టారు.
రాష్ట్ర విభజన తర్వాత సీన్ మారిపోయింది. తెలంగాణలో వైసీపీ జెండా పీకేసిన జగన్.. తన పార్టీ నాయకులను టీఆర్ఎస్లోకి పంపించారు. అప్పటి నుంచి రెండు పార్టీల మధ్య లోపాయికారీ తెరవెనుక స్నేహం నడుస్తోందని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుసు. ఏపీలో వైసీపీ, తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమి తర్వాత.. రెండు పార్టీల మధ్య ఉన్న బంధాన్ని మరింత ఓపెన్గా ప్రజల్లోకి తీసుకెళ్లే పయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది.
కేసీఆర్తో స్నేహం వల్ల ఏపీలో జగన్కి గానీ, వైసీపీకి గానీ ఒరిగేదేమీ లేదు. కానీ ఈ ఫ్రెండ్షిప్ ద్వారా తెలంగాణలో వైఎస్సార్ అభిమానులను కారు ఎక్కించుకోవాలని బీఆర్ఎస్ నాయకత్వం ఆలోచిస్తున్నట్లు కనిస్తోంది. తెలంగాణ తెలుగుదేశం శ్రేణులు రేవంత్రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ తమ టీమ్లో ఉన్నాడని చెప్పుకోవడం ద్వారా ప్రో వైఎస్సార్, యాంటీ టీడీపీ ఓటు బ్యాంకును గులాబీ జెండా వైపు మళ్లించాలని చూస్తున్నారు.
వైఎస్సార్, జగన్ ఫ్లెక్సీలు, ఫోటోలతో జరుగుతున్న బీఆర్ఎస్ ర్యాలీలపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. టీఆర్ఎస్ను.. బీఆర్ఎస్గా మార్చిన కేసీఆర్.. వచ్చే ఎన్నికలకు పార్టీ పేరును బీఆర్వైసీపీగా మార్చుతారేమో అని కామెంట్ చేస్తున్నారు. సోషల్ మీడియా సెటైర్లను పక్కన పెడితే.. బీఆర్ఎస్ ర్యాలీల్లో ఎన్ని ఫోటోలు పెట్టుకున్నా.. వైఎస్సార్ అభిమానులు గులాబీ జెండా పట్టుకొనే అవకాశాలు తక్కువని విశ్లేషకుల అభిప్రాయం. ఎందుకంటే వైఎస్సార్ అభిమానులంతా కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులే. జగన్ కోసం వీళ్లేవరూ హస్తం గుర్తుకి హ్యాండ్ ఇచ్చి కారెక్కరు.
హైదరాబాద్ సెటిలర్లలోనూ ఇప్పుడు కేసీఆర్ పార్టీ పట్ల అంత సానుకూలత లేదు. కేసీఆర్ కుమార్తె కవిత చేస్తున్న ఆంధ్రా వ్యతిరేక పాలిటిక్స్.. సెటిలర్లలో బీఆర్ఎస్ను నెగెటివ్ చేస్తున్నాయి. అన్నింటికీ మించి ప్రస్తుతం జరుగుతున్న సమగ్ర ఓటర్ల జాబితా ప్రక్షాళన తర్వాత.. తెలంగాణలో ఉంటున్న ఆంధ్ర సెటిలర్ల ఓట్లు చాలా వరకు ఎగిరిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.
చాలా మంది రెండు రాష్ట్రాల్లోనూ ఓట్లు ఉండటమే ఇందకు కారణం. ఇప్పటికీ ఎక్కువ మంది సెటిలర్లు ఏపీలోనే ఓటు కొనసాగించే ఆలోచనలో ఉన్నారు. అదే జరిగితే వచ్చే ఎన్నికల్లో సెటిలర్ల ఓట్లు.. జగన్ ఫ్యాక్టర్ వల్ల బీఆర్ఎస్కు పెద్దగా ఒరిగేదేమీ ఉండక పోవచ్చు. మొత్తం మీద ఆంధ్రా వ్యతిరేకత ఉద్యమ పార్టీ.. ఇప్పుడు టీడీపీ వ్యతిరేక పార్టీగా మారిపోయినట్లు కనిపిస్తోంది.
