రంగారెడ్డి జిల్లాలోని జన్వాడలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రేమించి వివాహం చేసుకున్న దంపతులు ఒకే ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
మృతులను బలసాయి, పద్మగా గుర్తించారు. ప్రేమ వివాహం చేసుకుని కుటుంబ జీవితాన్ని ప్రారంభించిన ఈ జంట, ఆదివారం తమ నివాసంలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నట్లు ప్రాథమిక సమాచారం వెల్లడైంది. ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాటిని శవపరీక్ష నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై కుటుంబ సభ్యులు, బంధువులను పోలీసులు విచారిస్తున్నారు.
ఈ విషాద ఘటనలో ఐదు నెలల పసిబిడ్డ తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారడం అందరినీ కలచివేస్తోంది. చిన్నారి భవిష్యత్తుపై కుటుంబ సభ్యులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
