మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. ఇరాన్కు చెందిన వ్యూహాత్మక ప్రాంతాలైన ఖేష్ దీవి, బందర్ అబ్బాస్, మరియు బుషెహర్ రేవు పట్టణాలపై శత్రు దేశాలు భారీ వైమానిక దాడులకు తెగబడ్డాయి. ఈ దాడుల్లో ఇరాన్ క్షిపణి వ్యవస్థలు, డ్రోన్ మౌలిక సదుపాయాలు, నిఘా వ్యవస్థలతో పాటు నౌకాదళ సామర్థ్యాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు సమాచారం. ఇరాన్ను ఆర్థికంగా, సైనికంగా దెబ్బతీసే వ్యూహంతోనే ఈ రేవు పట్టణాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు అంతర్జాతీయ రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ ఆకస్మిక దాడులతో ఇరాన్ సైన్యం ఒక్కసారిగా అప్రమత్తమైంది.
మరోవైపు ఈ దాడులకు ప్రతిచర్యగా ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్ జేసీ) పొరుగునే ఉన్న కువైట్పై భీకర దాడులు నిర్వహించింది. కువైట్లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఐఆర్ జేసీ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ భీకర దాడుల్లో అక్కడ మోహరించిన అమెరికా సైనిక స్థావరాలకు భారీ నష్టం వాటిల్లింది. ముఖ్యంగా అమెరికాకు చెందిన అత్యాధునిక అటాకామ్స్ (ATACMS) క్షిపణి వ్యవస్థ ఈ దాడిలో పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనలో ముగ్గురు అమెరికన్ సైనికులు అక్కడికక్కడే మరణించగా, మరికొంతమంది గాయపడ్డారు.
ఇరాన్ మరియు అమెరికా మిత్రదేశాల మధ్య జరుగుతున్న ఈ ఘర్షణలు గల్ఫ్ రీజియన్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. కువైట్లోని తమ స్థావరాలపై జరిగిన దాడి మరియు సైనికుల మృతిని అమెరికా రక్షణ శాఖ తీవ్రంగా పరిగణించింది. ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయోనన్న ఆందోళన ప్రపంచ దేశాల్లో వ్యక్తమవుతోంది. దాడులు, ప్రతిదాడులతో ఈ ప్రాంతంలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో చమురు రవాణాకు అత్యంత కీలకమైన పర్షియన్ గల్ఫ్ రీజియన్లో భద్రత ప్రశ్నార్థకంగా మారింది.
