ప్రముఖ సినీ నటి త్రిష పై పబ్లిక్ మీటింగ్ లో డబుల్ మీనింగ్ డైలాగ్ విసిరిన ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ ను పోలీసులు అరెస్టు చేశారు. తంజావూరులో జరిగిన డీఎంకే నిరసన సభలో ప్రముఖ నటి త్రిషను ఉద్దేశించి ద్వంద్వార్థం వచ్చేలా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ఈ చర్య చేపట్టారు.
డీఎంకే అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ కుమారుడైన ఉదయనిధిని చెన్నైలోని ఆయన నివాసం నుంచి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వెంట వెళ్తున్న సమయంలో ఆయన చిరునవ్వుతో కనిపించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
ఈ వివాదానికి కారణమైన సభ సోమవారం తంజావూరులో జరిగింది. కావేరి జలాల పంపిణీ అంశంపై ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ప్రభుత్వాన్ని ఉదయనిధి తీవ్రంగా విమర్శిస్తున్న సమయంలో సభలో కొందరు కార్యకర్తలు “త్రిషా… త్రిషా…” అంటూ నినాదాలు చేశారు. ఆ సమయంలో ఉదయనిధి నటి త్రిషను ఉద్దేశించి అభ్యంతరకరమైన ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు వెలువడ్డాయి.
ఈ వ్యాఖ్యలపై అధికార తమిళగ వెట్రి కళగం (TVK) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది కేవలం ఒక సినీ నటిని అవమానించడం మాత్రమే కాకుండా మహిళలను కించపరిచే విధమైన వ్యాఖ్యలుగా పరిగణించాలని పార్టీ నాయకులు పేర్కొన్నారు. మరికొందరు అధికార పార్టీ నేతలు ఉదయనిధిని “వల్గర్-నిధి” అంటూ విమర్శిస్తూ ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అరెస్ట్ అనంతరం స్పందించిన ఉదయనిధి స్టాలిన్ తాను చెప్పని మాటలను తనపై మోపుతున్నారని ఆరోపించారు. ప్రజల దృష్టిని అసలు సమస్యల నుంచి మళ్లించేందుకే ఈ కేసు నమోదు చేశారని, న్యాయపరంగా దీనిని ఎదుర్కొంటానని తెలిపారు.
ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ ఉదయనిధి స్టాలిన్ దాఖలు చేసిన పిటిషన్పై మద్రాస్ హైకోర్టు విచారణ చేపట్టనుంది.
తంజావూరు ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఉదయనిధిపై భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్లు 61, 79, 192, 196, 296(b), 351(2), 352 కింద కేసు నమోదు చేశారు. అదనంగా తమిళనాడు మహిళల వేధింపుల నిరోధక చట్టంలోని సెక్షన్-4తో పాటు సమాచార సాంకేతిక చట్టం (IT Act)లోని సెక్షన్-67 కింద కూడా అభియోగాలు మోపారు. టీవీకే నాయకులు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ కేసు నమోదు అయినట్లు పోలీసులు తెలిపారు.
ఇదే అంశంపై అధికార టీవీకే పార్టీ జాతీయ మహిళా కమిషన్ను కూడా ఆశ్రయించింది. పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పళా సెల్వకుమార్ మహిళా కమిషన్కు ఫిర్యాదు సమర్పించగా, తంజావూరు సెంట్రల్ జిల్లా మహిళా విభాగం నిర్వాహకురాలు ఎస్. బైరవి తంజావూరు ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ప్రత్యేక ఫిర్యాదు చేశారు.
మరోవైపు డీఎంకే ఎంపీ కనిమొళి ఉదయనిధి అరెస్టును తీవ్రంగా ఖండించారు. వ్యక్తిగత కక్షతో ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. కేసు నమోదు చేసి న్యాయస్థానం తీర్పు వచ్చే వరకు వేచి చూడకుండా, ప్రతిపక్షాన్ని రాజకీయంగా అణచివేసేందుకు ఇలాంటి చర్యలు చేపట్టడం చట్ట విరుద్ధమని అన్నారు. బుధవారం ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్ష నేత హాజరుకాకుండా అడ్డుకోవడమే అరెస్టు వెనుక అసలు ఉద్దేశమని ఆమె ఆరోపించారు.
బీజేపీ ఐటీ సెల్ అధినేత అమిత్ మాల్వీయ కూడా ఈ వివాదంపై ఉదయనిధి స్టాలిన్ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు.
కావేరి జలాల పంపిణీ విషయంలో తమిళనాడుకు రావాల్సిన వాటా నీరు అందడం లేదని, ప్రభుత్వం స్పందించడం లేదని ఆరోపిస్తూ డీఎంకే తంజావూరులో ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించింది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య కావేరి జలాల పంపిణీ వివాదం ఎన్నో దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఆ అంశంపైనే ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వాన్ని ఉదయనిధి తీవ్రంగా విమర్శించిన సమయంలో ఈ వివాదం చెలరేగి, చివరకు ఆయన అరెస్టుకు దారితీసింది.
