పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అత్యంత శక్తిమంతమైన ముగ్గురు మహిళలు ఓడిపోగా బీజేపీ నుంచి రంగంలో దిగిన ముగ్గురు సాధారణ మహిళలు విజయం సాధించడం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్నది. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మహిళల పాత్రపై తీవ్ర చర్చకు దారితీసే విధంగా తాజా వ్యాఖ్యలు, పోలికలు వెలుగులోకి వచ్చాయి.
తృణమూల్ కాంగ్రెస్కు చెందిన ప్రముఖ మహిళా నాయకులు మహువా మొయిత్రా, సాగరికా ఘోష్, సయోనీ ఘోష్ లు ఈ ఎన్నికలలో ఓడిపోయారు. వీరు ముగ్గురు ఎక్కువ చదువుకున్నవారు, తెలివిగలవారు, సాధించిన వారి (ఎఛీవర్స్) జాబితాలో ఉంటారు. ఇక మరోవైపు భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించిన ముగ్గురు మహిళా అభ్యర్థులను పరిశీలిస్తే రేఖా పత్రా, రత్నా దేబ్ నాఘ్, కలితా మాజీ లు తమ వ్యక్తిగత జీవితాల్లో ఎదుర్కొన్న కష్టాలు, సామాజిక సమస్యల నేపథ్యంతో ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందడం ప్రత్యేకంగా ప్రస్తావించబడుతోంది.
గెలిచిన బీజేపీ అభ్యర్ధులను ఆకాశానికి ఎత్తడంలో తప్పు లేదు కానీ ఓడిన తృణమూల్ కాంగ్రెస్ మహిళ అభ్యర్ధులపై జరుగుతున్న ప్రచారం మాత్రం అభ్యంతరకరంగానే ఉంది. తృణమూల్ కాంగ్రెస్ మహిళలు కేవలం ఆంగ్లంలో ప్రావీణ్యం, ప్రెజెంటేషన్ మాత్రమే వారి ప్రత్యేకతలు అని విమర్శకులు ఆరోపిస్తున్నారు. సందేశ్ఖాలి ఘటనలో బాధితురాలిగా నిలిచిన రేఖా పత్రా, ఆర్జీ కర్ ఆసుపత్రి ఘటనలో బాధితురాలి తల్లిగా ఉన్న రత్నా దేబ్నాథ్, గృహ సహాయకురాలిగా పని చేసిన కలితా మాజి వంటి మహిళలు ప్రజల మద్దతుతో విజయం సాధించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
వీరి విజయాన్ని మహిళల అసలైన సాధికారతకు ప్రతీకగా బీజేపీ వర్గాలు అభివర్ణిస్తున్నాయి. ‘నిజమైన మహిళా శక్తి’గా పేర్కొంటూ చర్చ సాగుతోంది. అయితే ఈ పోలికలపై మరోవైపు విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. వ్యక్తిగత లక్షణాలు, నేపథ్యాల ఆధారంగా మహిళలను తక్కువ చేసి మాట్లాడడం సరికాదని, రాజకీయ చర్చలు విధానాలు, పనితీరు ఆధారంగా జరగాలని కొందరు అభిప్రాయపడుతున్నారు. మహిళల సాధికారత అనేది విభిన్న రూపాల్లో వ్యక్తమవుతుందని, రాజకీయ వేదికలపై పరస్పర గౌరవం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
మొత్తానికి, బెంగాల్ రాజకీయాల్లో మహిళా నాయకత్వం, సాధికారత అంశాలు ఇప్పుడు ప్రధాన చర్చగా మారాయి. వివిధ పార్టీల మహిళా నేతల విజయాలు, ప్రయాణాలు వేర్వేరు కోణాల్లో చర్చకు వస్తుండగా, ఈ అంశం రాజకీయంగా మరింత వేడెక్కే అవకాశముంది.
