ప్రకాశం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చిల్డ్రన్ సమ్మర్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ -2026 ను మంగళవారం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఒంగోలులోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు ప్రారంభించారు. ఈ క్యాంపులో భాగంగా నిర్వహిస్తున్న పరుగుపందెం, ఫుట్బాల్, టగ్ ఆఫ్ వార్, క్రికెట్ వంటి క్రీడలను జిల్లా ఎస్పీ గారు బెలూన్లు గాలిలోకి ఎగురవేసి ప్రారంభించారు. అనంతరం, జిల్లా ఎస్పీ గారు స్వయంగా చిన్నారులతో కాసేపు క్రికెట్ ఆడి వారిని ఉత్సాహపరిచారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పిల్లలకు మానసిక ఉల్లాసం, క్రీడల ఆసక్తితో పాటుగా వివిధ క్రీడల పట్ల నైపుణ్యత పెంపొందించేందుకు ప్రతి సంవత్సరం వేసవి సెలవులలో ఈ క్యాంపును నిర్వహిస్తున్నామని, ఈ క్యాంపు నెల రోజులు పాటు జరుగుతుందని, ఈ సమ్మర్ క్యాంప్ లో పాల్గొనేందుకు పోలీస్ పిల్లలు మరియు ఇతర విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్నామన్నారు.
ఈ సమ్మర్ క్యాంప్లో పిల్లలు వివిధ రకాల ఆటలు మరియు క్రీడలు కేవలం వినోదం మాత్రమే కాదని, అవి శారీరక మరియు మానసిక అభివృద్ధికి చాలా ముఖ్యమైనవి అని, క్రమశిక్షణ, జట్టు స్ఫూర్తి, నాయకత్వ లక్షణాలు, వివిధ పరిస్థితులను ఎదుర్కోవడంలో అవసరమైన మెలకువలు,కొత్త పరిచయాలు మరియు ఓటమిని స్వీకరించే గుణం వంటి ఎన్నో విలువైన విషయాలను క్రీడల ద్వారా నేర్చుకోవచ్చునని మరియు కొత్త స్నేహితులను పొందవచ్చున్నారు.
ఒక నెలపాటు జరిగే ఈ క్యాంప్ పిల్లలలో స్ఫూర్తి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే కాకుండా, వారి జీవితంలో చిరస్మరణీయ అనుభవంగా నిలుస్తుందని అన్నారు. క్రీడల పట్ల ఆసక్తి కలిగిన వారిని ఆ దిశలో ప్రోత్సహిస్తే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను చేరుకుంటారన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పిల్లలకు ఫిజికల్ ఫిట్నెస్ ఎంతో అవసరమని, క్రీడలతో మానసిక, శారీరక ఉల్లాసం చేకూరుతుందన్నారు.
సమ్మర్ క్యాంపులో ఫుట్ బాల్, టగ్ అఫ్ వార్, షటిల్ బ్యాడ్మింటన్, రన్నింగ్, కరాటీ మరియు ఇతర క్రీడలు అందుబాటులో ఉన్నాయి. ఈ క్యాంపు హెడ్ కానిస్టేబుల్ రాజేంద్ర పోలీస్ చిల్డ్రన్స్ కమిటీ ప్రెసిడెంట్ మరియు వివిధ రంగాలలోని క్రీడాకారులు పిల్లలకు కోచింగ్ ఇవ్వనున్నారు.
ఈ కార్యక్రమంలో ఎఆర్ డిఎస్పీ కె. శ్రీనివాసరావు, ఆర్ఐలు రమణ రెడ్డి, సీతారామిరెడ్డి, ఏఆర్ ఎస్సైలు ప్రసాద్, సురేష్,తిరుపతి స్వామి, బాషా, క్రీడాకారులు మరియు పిల్లలు పాల్గొన్నారు.
