ఏపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అద్భుమైన ఆఫర్ని ప్రకటించింది. 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందాలనుకొంటే.. ఈ పథకం కోసం అప్లయ్ చేసుకోవచ్చు. ఇంతకీ ఇది ఏ స్కీమ్ అంటే.. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా సోలార్ విద్యుత్ వినియోగం పెంచడానికి సూర్యఘర్ యోజన పథకాన్ని తీసుకొచ్చింది. ఎవరి ఇంటి మీద వాళ్లే సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేసుకొంటే.. వారికి కేంద్రం సబ్సిడీ ఇస్తుంది. ఉదాహరణకు 3 కిలోవాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు కోసం లక్షా 50 వేలు ఖర్చవుతుంది. ఇందులో 51 శాతం అంటే 78 వేలు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తుంది. అదే 2 కిలోవాట్ల సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకుంటే.. సబ్సిడీ కింద 60 వేల రూపాయలు ఇస్తారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ స్కీమ్ని ఎక్కువ మంది ప్రజలకు ఉపయోగపడాలని సబ్సిడీ మొత్తాన్ని మరింత పెంచింది. ఎస్సీ, ఎస్టీ లబ్దిదారులకు సోలార్ రూఫ్టాప్ ఏర్పాటులో వంద శాతం సబ్సిడీని అందజేస్తారు. అంటే 3 కిలోవాట్ల సోలార్ యూనిట్ ఏర్పాటుకు అయ్యే లక్షా 50 వేలను పూర్తిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి. ఈ యూనిట్ ద్వారా నెలకు 300 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. అంటే 300 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ లభిస్తుందన్న మాట. ఈ స్కీమ్ ద్వారా ఇంకో ప్రయోజనం ఉంది. రూఫ్ టాప్ సోలార్ యూనిట్ను గ్రిడ్కు అనుసంధానం చేస్తే.. ఇంట్లో ఉపయోగించుకోని కరెంటును గ్రిడ్ ద్వారా తీసుకొని.. లబ్దిదారులకు రివర్స్లో యూనిట్కి మార్కెట్ రేటును చెల్లిస్తారు.
ప్రధాని సూర్యఘర్ యోజన పథకం ఏపీలోని ఎస్సీ, ఎస్టీలకు పూర్తి ఉచితంగా అమలు చేయనున్నారు. బీసీలకు కేంద్ర సబ్సిడీతో పాటు రాష్ట్ర ప్రభుత్వమూ కొంత మొత్తం సబ్సిడీగా ఇస్తుంది. ఆసక్తి కలిగిన వారు పీఎం సూర్యఘర్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లోనే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. దరఖాస్తునకు ఆమోదం లభిస్తే.. రూఫ్టాప్ సోలార్ యూనిట్ కొనుగోలుకు కొన్ని కంపెనీల పేర్లను ఇస్తారు. ఇన్స్టాలేషన్ పూర్తయిన తర్వాత.. నెల రోజుల్లోనే సబ్సిడీ మొత్తం లబ్దిదారుల ఖాతాలో పడుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు ఉచిత విద్యుత్ పొందాలంటే.. వెంటనే పీఎం సూర్యఘర్ పథకానికి అప్లయ్ చేసుకోండి.
