టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే మాధవి రెడ్డి సమక్షంలో టీడీపీలో మాజీ కార్పొరేటర్ ఓర్సు బాల కొండయ్య, వారి అనుచరులు చేరారు.
కడప నగర అభివృద్ధి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంపై నమ్మకంతో వైకాపాకు చెందిన ముఖ్య నేతలు, కార్యకర్తలు భారీగా తెలుగుదేశం పార్టీ బాట పడుతున్నారు. కడప నగరంలో తెలుగుదేశం పార్టీకి పెరుగుతున్న ప్రజాదరణకు ఈరోజు జరిగిన భారీ చేరికలే నిదర్శనం.
2వ డివిజన్, చలామా రెడ్డి పల్లికి చెందిన వైసీపీ మాజీ కార్పొరేటర్ ఓర్సు బాల కొండయ్య ఆధ్వర్యంలో, భారీ వైసీపీ క్యాడర్ ఈరోజు టీడీపీలో చేరారు. ముఖ్యంగా, బాల కొండయ్య తో పాటు సుమారు 300 కుటుంబాలు వైకాపాను వీడి పసుపు జెండాను కప్పుకోవడం నగర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది.
ఈ భారీ చేరికల కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవి పాల్గొని, వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. కడప అభివృద్ధి కేవలం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారు, కడప నగరంలో తెలుగుదేశం పార్టీకి పెరుగుతున్న ప్రజాదరణకు ఈ వలసలే నిదర్శనమని, పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. నగర అభివృద్ధిలో అందరినీ భాగస్వాములను చేస్తామని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కడప స్థానిక టిడిపి కార్పొరేటర్లు, రాష్ట్రస్థాయి నాయకులు, జిల్లా కమిటీ & నగర కమిటీ సభ్యులు,పార్టీ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
