భారత్ కు చెందిన కంపెనీలు అంతర్జాతీయంగా ప్రముఖ స్థానాలలో కొనసాగుతున్నాయని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ అన్నారు. ప్రపంచ స్థాయి కృత్రిమ మేధస్సు (AI) రంగంలో ముందంజలో నిలిచే తదుపరి దిగ్గజ సంస్థ భారత్ నుంచే రాబోతున్నట్లు కూడా ఇప్పటికే వెల్లడైందని ఆయన అన్నారు.
దేశంలో ఎకోసిస్టమ్ గణనీయంగా అభివృద్ధి చెందిందని, “అసాధారణమైన” స్వదేశీ కంపెనీలు భారత్లోనే పుట్టుకొస్తున్నాయని ఆయన అన్నారు. ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్లో పాల్గొనేందుకు భారత్ వచ్చిన పిచై, దేశంలో డెవలపర్ శక్తి మరియు పారిశ్రామిక వేత్తల ఉత్సాహం అత్యంత ఉన్నత స్థాయిలో ఉందని ప్రశంసించారు. “తదుపరి సుందర్” భారత్లోనే ఉండి ప్రపంచ స్థాయి సంస్థను నిర్మించాలంటే ఏమి మారాలి?” అనే ప్రశ్నకు స్పందిస్తూ, ఆ మార్పు ఇప్పటికే ప్రారంభమైందని ఆయన స్పష్టం చేశారు.
ఫ్లిప్ కార్ట్ (Flipkart) ఓయో (Oyo) వంటి స్వదేశీ స్టార్టప్లు ప్రపంచ స్థాయిలో విజయవంతంగా ఎదుగుతున్నాయన్నది ఇందుకు నిదర్శనమని చెప్పారు. “భారత్ ఇప్పటికే అసాధారణమైన కంపెనీలను ఉత్పత్తి చేస్తోంది. ఫ్లిప్కార్ట్, ఓయో వంటి సంస్థలు ఇక్కడే పుట్టి గొప్ప విజయాలు సాధిస్తున్నాయి,” అని పిచయ్ వ్యాఖ్యానించారు.
ప్రత్యేకించి బెంగళూరు వంటి టెక్ కేంద్రాల్లో డెవలపర్ ఎనర్జీ ప్రపంచంలోనే అగ్రస్థాయిలో ఉందని, దేశంలోని స్టార్టప్ ఎకోసిస్టమ్ వేగంగా విస్తరిస్తోందని తెలిపారు. కృత్రిమ మేధస్సు రంగంలో కూడా భారత్లో వేగంగా పురోగతి జరుగుతోందని పేర్కొంటూ, Sarvam AI వంటి సంస్థలు స్థానిక అవసరాలకు అనుగుణంగా AI మోడళ్లను అభివృద్ధి చేస్తున్నాయని చెప్పారు.
ఇది అత్యాధునిక సాంకేతిక ఆవిష్కరణలు దేశంలోనే పుట్టుకొస్తున్నాయని సూచిస్తున్నదని అన్నారు. భారత్ ప్రపంచ స్థాయి AI సంస్థలను నిర్మించడంలో ఎలాంటి అడ్డంకులు కనిపించడం లేదని, ఈ దిశగా దేశం చాలా బలమైన స్థితిలో ఉందని సుందర్ పిచయ్ విశ్వాసం వ్యక్తం చేశారు.
