సమాజానికి తిరిగి ఇచ్చేయడం (Pay back to the society) అనే డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఆశయానికి ఆందోల్ నియోజకవర్గంలోని వటపల్లి మండలం బుడ్డాయిపల్లి గ్రామం వేదికైంది. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని గ్రామ దళితబంధు లబ్ధిదారులు అపూర్వ రీతిలో వేడుకలను నిర్వహించారు. ఆర్థిక స్వాలంబన సాధించిన ఆనందంలో, తమ సొంత నిధులతో గ్రామంలో అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించుకుని తమ కృతజ్ఞతను చాటుకున్నారు.
దళితబంధు పథకం ద్వారా పొందిన ట్రాక్టర్లు, కార్లు మరియు ఇతర వాహనాలతో లబ్ధిదారులు భారీ ర్యాలీ నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా సాగిన ఈ ప్రదర్శన, దళితుల ఆర్థిక ప్రగతికి అద్దం పట్టింది. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ, అంబేడ్కర్ స్ఫూర్తి కలిగిన మాజీ ముఖ్యమంత్రి కె.సి.ఆర్ వల్లే ఈ అద్భుత పథకం సాధ్యమైందని, తమ జీవితాల్లో వెలుగులు నిండాయని కొనియాడారు.
ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, సైనిక సమత దళ్ అధ్యక్షుడు చెంద్రయ్య, ఆనంతయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రాంతి కిరణ్ మాట్లాడుతూ, “అంబేడ్కర్ కలలుగన్న ఆర్థిక సమానత్వాన్ని సాధించే దిశగా దళితబంధు ఒక విప్లవాత్మక అడుగు” అని పేర్కొన్నారు. బుడ్డాయిపల్లి దళితులు తమ సంపాదనలో కొంత భాగాన్ని సమాజ హితం కోసం ఖర్చు చేయడం గర్వకారణమని అతిథులు అభినందించారు.
హక్కుల కంటే ఆర్ధిక స్వేచ్ఛ ముఖ్యం
బాబాసాహెబ్ అంబేడ్కర్ కేవలం సామాజిక విప్లవకారుడు మాత్రమే కాదు, ఆయన గొప్ప ఆర్థికవేత్త కూడా. దళితుల ఆర్థిక స్వాలంబన గురించి ఆయన ముఖ్యమైన అంశాలను నొక్కి చెప్పారు. రాజకీయ హక్కుల కంటే ఆర్థిక స్వేచ్ఛ ముఖ్యమని అంబేడ్కర్ భావించారు.
ఆర్థికంగా బలంగా లేనంత వరకు సామాజిక గౌరవం దక్కదని ఆయన హెచ్చరించారు. దళితులు కేవలం కూలీలుగా, ఉద్యోగులుగానే కాకుండా.. పెట్టుబడిదారులుగా, పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. కీలక పరిశ్రమలు, భూమిపై ప్రభుత్వ నియంత్రణ ఉండి, అవి బలహీన వర్గాల ఆర్థిక ప్రయోజనాల కోసం ఉపయోగపడాలని ఆయన ప్రతిపాదించారు.

అంబేడ్కర్ ఆశించిన “పారిశ్రామిక వేత్తలుగా దళితులు” అనే లక్ష్యాన్ని ఆసరాగా చేసుకుని గతంలో కేసీఆర్ ప్రభుత్వం దళితబంధు పథకం ఆచరణలోకి తెచ్చింది. ఎటువంటి పూచీకత్తు లేకుండా ప్రభుత్వం అందించిన ₹10 లక్షల ఆర్థిక సాయం, దళితులను యజమానులుగా మార్చింది. బుడ్డాయిపల్లి వంటి గ్రామాల్లో లబ్ధిదారులు వాహనాల ద్వారా రవాణా రంగంలో స్థిరపడి, గౌరవప్రదమైన ఆదాయాన్ని పొందుతున్నారు.
ఆర్థికంగా నిలదొక్కుకున్న దళితులు, తిరిగి సమాజం కోసం అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఆయన ఆశయాలకు నిలువెత్తు సాక్ష్యం. “ఉద్యమించు, సమీకరించు, బోధించు” అనే అంబేడ్కర్ పిలుపును బుడ్డాయిపల్లి దళితులు ఆర్థిక సాధికారత ద్వారా నిజం చేసి చూపారు.
ఈ వేడుక కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాదు, దళిత సమాజం సాధించిన ఆర్థిక విజయానికి ప్రతీక. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నాగరాణీ, సీనియర్ నాయకులు మాసాన్ పల్లి నారాయణ,వరం అధ్యక్షుడు వీరారెడ్డి, సొసైటీ ఛైర్మెన్ దుర్గరెడ్డి, అల్లదుర్గం మండల పార్టీ అధ్యక్షుడు నర్సింహులు, మాజీ సర్పంచ్ లు యాదగిరి, ప్రభాకర్ , రాజు, ఆందోల్ పట్టణ అధ్యక్షుడు చేపల వెంకటేశం, కృష్ణ గౌడ్ మాజీ ఎం పి టి సి సదానందం, శంకర్ గ్రామ అంబేద్కర్ యువజన సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
