పాకిస్థాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్లో బలోచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) అత్యంత భీకరమైన దాడులతో విరుచుకుపడింది. శనివారం వేకువజామున ఆ సంస్థ ప్రకటించిన ‘ఆపరేషన్ హెరోఫ్ 2.0’ (Operation Herof 2.0) లో భాగంగా క్వెట్టా, గ్వాదర్, మస్తుంగ్, నోష్కి సహా సుమారు 12 జిల్లాల్లో ఏకకాలంలో విధ్వంసం సృష్టించారు.
తిరుగుబాటుదారులు పోలీస్ స్టేషన్లు, సైనిక స్థావరాలు, సరిహద్దు భద్రతా దళాల (FC) కార్యాలయాలు మరియు ఐఎస్ఐ (ISI) ఆఫీసులను లక్ష్యంగా చేసుకుని గన్ ఫైట్, ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. ముఖ్యంగా నోష్కి ప్రాంతంలోని హై-సెక్యూరిటీ జైలుపై దాడి చేసి తమ సానుభూతిపరులను విడిపించుకోవడమే కాకుండా, రైల్వే ట్రాక్లను పేల్చివేసి రవాణా వ్యవస్థను పూర్తిగా స్తంభించజేశారు.
ఈ ఘర్షణల్లో మృతుల సంఖ్య భారీగా ఉన్నట్లు తెలుస్తోంది. పాక్ అధికారిక వర్గాల ప్రకారం, గత 48 గంటల్లో జరిగిన పోరులో 133 మందికి పైగా బీఎల్ఏ తిరుగుబాటుదారులు మరణించగా, 17 మంది భద్రతా సిబ్బంది మరియు 31 మంది సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారు.
అయితే బీఎల్ఏ తమ దాడుల్లో 300 మందికి పైగా సైనికులను హతమార్చామని, పలువురిని బందీలుగా పట్టుకున్నామని ప్రకటించింది. ఈ పరిస్థితులపై పాకిస్తాన్ తీవ్రంగా స్పందిస్తూ, ఈ దాడుల వెనుక భారత్ హస్తం ఉందని, భారత నిఘా సంస్థల అండతోనే బీఎల్ఏ ఈ స్థాయి ఆపరేషన్ నిర్వహించిందని ఆరోపించింది.
పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రి దీనిని ‘భారత ప్రేరేపిత ఉగ్రవాదం’గా అభివర్ణించారు. భారత విదేశాంగ శాఖ పాక్ ఆరోపణలను నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. తన సొంత భూభాగంలో శాంతిభద్రతలను కాపాడటంలో విఫలమైన పాకిస్తాన్, ఆ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఎప్పటిలాగే భారత్పై నిందలు వేస్తోందని మండిపడింది.
బలూచిస్తాన్ ప్రజల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుండా, అక్కడి మానవ హక్కుల ఉల్లంఘనలను దాచిపెట్టేందుకే పాక్ ఈ తరహా విష ప్రచారం చేస్తోందని భారత్ స్పష్టం చేసింది. ప్రస్తుతం బలూచిస్తాన్ అంతటా ఇంటర్నెట్ సేవలు నిలిపివేయగా, పాక్ సైన్యం భారీ ఎత్తున కూంబింగ్ ఆపరేషన్లు కొనసాగిస్తోంది.
