రానున్న రెండు రోజులు రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొననున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. రేపు,ఎల్లుండి మేఘావృతమైన వాతావరణంతో పాటు పిడుగులతో కూడిన వర్షాలు, మరోవైపు కొన్ని జిల్లాల్లో ఎండలు ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు.
దక్షిణ కోస్తాంధ్ర -పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని ఏపీఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. రాయలసీమ మరియు పరిసర ప్రాంతాలపై మరోక ఉపరితల ఆవర్తనము విస్తరించి ఉందని పేర్కొన్నారు.
వీటి ప్రభావంతో రేపు ఎల్లుండి మేఘావృతమైన వాతావరణంతో పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు పొలాల్లో పని చేసే రైతులు, పశు కాపరులు చెట్ల కింద నిలబడరాదని హెచ్చరించారు.
సోమ, మంగళవారాల్లో వాతావరణం క్రింద విధంగా ఉండనున్నట్లు ప్రఖర్ జైన్ వివరించారు.
శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ,తూర్పుగోదావరి , పశ్చిమగోదావరి జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
రేపు పోలవరం జిల్లా చింతూరు, ఎన్టీఆర్ జిల్లా జి. కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో వడగాలులు ప్రభావం చూపనున్నట్లు తెలిపారు.
ఆదివారం మన్యం(జి) వీరఘట్టం,నెల్లూరు(జి) నెల్లూరుపాలెంలో 42.4°C, తిరుపతి(జి) రేణిగుంటలో 42.3°C, మార్కాపురం(జి) నందన మారెళ్లలో 41.8°C, కడప(జి) ఒంటిమిట్టలో 41.5°C, కృష్ణా(జి) పెద్దపారుపూడిలో 41.3°C, చిత్తూరు(జి) పలమనేరు, ప్రకాశం(జి) చెరువుకొమ్ము పాలెంలో 40.9°C, కర్నూలు(జి) తోవి, శ్రీకాకుళం(జి) జి. సిగడాంలో 40.7°C, అనంతపురం(జి) భట్టువానిపల్లిలో 40.5°C, పల్నాడు(జి) గురజాలలో 40.4°C, విజయనగరం(జి) సంతకవిటిలో 40.3°C, నంద్యాలలో 40.1°C చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు, 66 మండలాల్లో 40°C కుపైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.
ఎండ తీవ్రత,ఉక్కపోత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
